ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో రాజకీయాలకు అతీతంగా చాలా మంది యువత పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్ధులపై జరిగిన హింసాత్మక దాడిపై యావత్ దేశం భగ్గుమంటున్న తరుణంలో.. ఇక్కడ బీఆరెస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికగా ఆకర్షిత అనే విద్యార్థిని ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.
రాజకీయాలపై అవగాహన ఉండి.. ప్రస్తుత పరిస్థితులను ఔపోసన పట్టిన విద్యార్ధినిలా ఆమె మాట్లాడిన తీరు ఆకర్షించింది. తాను కేటీఆర్కో, బీఆరెస్కో ఫేవర్ చేయడానికి రాలేదని ముందుగానే ప్రకటించుకున్న ఆకర్షిత.. ప్రధాని, ప్రధాన్ ఇద్దరూ సిగ్గుపడాలని తిట్లతోనే తన ప్రసంగాన్ని ఆరంభించారు.
తన ఫ్యామిలీ మొత్తం బీజేపీ సపోర్టర్సేనని పరిచయం చేసుకున్న ఆ అమ్మాయి… ఇకపై మేము బీజేపీకి అనుకూలంగా ఉండము.. అలాగే మోడీని వదలిపెట్టం.. వెంటాడుతాం.. న్యాయం జరిగే వరకు! అని నిజాయితీగా ఆమె మాట్లాడిన తీరు.. ప్రస్తుత పరిస్థితులను కళ్లముందుంచిన వైనం.. ఆకర్షించింది. ధర్మో రక్షితి రక్షితః అని సుద్దులు చెప్పే మోడీ, బీజేపీ.. ఢిల్లీలో జెన్-జీ చేస్తున్న ఉద్యమాన్ని ఎందుకు ధర్మబద్దంగా చూడలేకపోయిందని ఆమె ప్రశ్నించిన తీరు ఆలోచింపజేసింది.
న్యాయం అడిగితే దాడులు చేయడం.. దేశ ద్రోహులుగా ముద్రవేయడమేనా నీ ధర్మం..? అని ప్రశ్నించిన ఆమె.. నీ ధర్మో రక్షితి రక్షితః నినాదం ఏమైంది.. అని ఆమె ఇచ్చిన నినాదానికి.. సభికుల నుంచి పేపర్ లీకైంది..! అని సమాధానం వచ్చింది. విద్యార్ధుల ప్రాణాలు పోతున్నా మోడీకి తన రాజకీయం, అహం, అధికారమే ఎక్కువయ్యాయని ఆకర్షిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోప్రజాస్వామ్యం ఎక్కడుందని అడిగిన ఆమె.. పోక్సో కేసులో నిందితులకు వెంట వెంటనే బెయిల్ దొరుకుతుంది..? కానీ పేపర్ లీకేజీ పై న్యాయమడిగిన విద్యార్ధులకు మాత్రం ఎన్ని రోజలైనా మీకు టైం దొరకదు..? వారి గురించి పట్టించుకునే తీరిక ఉండదని..విమర్శించిన తీరు కూడా చర్చకు తెర తీసింది.
ఇన్ని జరుగుతున్నా ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందని అనుకోవాలా? అని ఆమె కేంద్రాన్ని నిలదీశారు. ధర్మేంద్ర రాజీనామా చేయాలని, ఇంతటితోనే దీనికి పరిష్కారం లభించదన్నారామె. మొత్తం విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి.. విద్యార్ధుల జీవితాలను, వారి భవష్యత్తును కాపాడే విధంగా పరిపాలనలో మార్పులు రావాలని ఆకాంక్షించారు ఆకర్షిత.
దేశాన్ని విచ్చన్నం చేసే శక్తులుగా మేం ఉద్యమాలు చేస్తున్నామన్న మోడీ.. మా నిజాయితీని శంకించొద్దని వారించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. యువత సంయమనం కోల్పోవద్దని ఇదే దీక్షతో నిబద్దతతో ఉద్యమంలో ముందుకు సాగాలని ఆకర్షిత పిలుపునిచ్చారు.