Silent Calls Cyber Fraud| ఇటీవలి కాలంలో చాలామంది తమ ఫోన్లకు సైలెంట్ కాల్స్ వస్తున్నాయని నెట్వర్క్ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. సైలెంట్ కాల్స్ అంటే.. ఫోన్ రింగ్ అవుతుంది. కానీ ఫోన్ ఆన్సర్ చేస్తే అవతలి వైపు ఎటువంటి శబ్దం రాదు. మీరు హలో అన్నా.. పలకరించినా పూర్తి నిశ్శబ్దం మాత్రమే వినిపిస్తుంది. భారతదేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సైలెంట్ కాల్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. మోసగాళ్లు ఈ కాల్స్తో మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టినట్లే. సైలెంట్ కాల్స్తో మీ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదా అని సైబర్ మోసగాళ్లు చెక్ చేస్తారు.
సైలెంట్ కాల్స్ సాధారణం కాదు.. ప్రమాదకరం. ఇవి సైబర్ క్రిమినల్స్ మొదటి అడుగు. మీ నంబర్ యాక్టివ్ అని తెలిస్తే స్కామ్ లేదా హ్యాకింగ్కు ఉపయోగిస్తారు. ఇవి ఫిషింగ్ అటాక్స్, ఆర్థిక మోసాలు, డేటా దొంగతనానికి దారి తీస్తాయి. వీటిని పట్టించుకోకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డబ్బు పెద్ద ప్రమాదంలో పడతాయి.
సైబర్ క్రిమినల్స్ టెక్నాలజీ ఉపయోగించి ఆటోమేటిక్గా లక్షల కాల్స్ చేస్తారు. మాట్లాడకుండా ఏ నంబర్లు రెస్పాండ్ అవుతున్నాయో చూస్తారు. యాక్టివ్ నంబర్లను టార్గెట్ చేసి వాట్సాప్ లేదా SMS స్కామ్లు పంపుతారు. కొన్నిసార్లు OTP లేదా బ్యాంక్ వివరాలు షేర్ చేయమని మోసం చేస్తారు. సైలెంట్ కాల్స్ చిన్నవిగా కనిపించినా పెద్ద మోసాలకు దారితీస్తాయి.
తరచూ సైలెంట్ కాల్స్ వస్తే వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేయండి. అనుమానాస్పద నంబర్లకు కాల్ బ్యాక్ చేయవద్దు. కాల్ వచ్చిన తేదీ, సమయం, నంబర్ రికార్డ్ చేసుకోండి. సైబర్ పోలీస్ విభాగంలో రిపోర్ట్ చేయండి. దీంతో సైబర్ మోసాలు నిరోధించవచ్చ.
భారత ప్రభుత్వం సైబర్ మోసాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్లో మోసపూరిత కాల్స్ లేదా మెసేజెస్ రిపోర్ట్ చేయవచ్చు. sancharsaathi.gov.in వెబ్సైట్కు వెళ్లి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఎంచుకోండి. ఇందులో చక్షు ఆప్షన్ క్లిక్ చేసి కంప్లైంట్ ఫామ్ ఫిల్ చేయండి. కాల్ సమయం, స్కామ్ టైప్, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వండి. మీ వ్యక్తిగత వివరాలు ఇచ్చి OTP వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. రిపోర్ట్ అయిన తర్వాత అధికారులు మోసగాళ్లను ట్రాక్ చేసి యాక్షన్ తీసుకుంటారు.
Also Read: ఆన్లైన్ హోటల్ బుకింగ్ చేస్తున్నారా? నకిలీ వెబ్సైట్లతో దోపిడీ.. ఎలా చేస్తున్నారంటే
సైలెంట్ కాల్స్ రిపోర్ట్ చేయడం మీకు మాత్రమే కాదు ఇతరులకు కూడా రక్షణ. ప్రభుత్వం రిపోర్ట్స్తో మోసపూరిత నెట్వర్క్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది. అనుమానాస్పద కాల్స్ పట్టించుకోకపోతే మోసగాళ్లు మరింత మందిని టార్గెట్ చేస్తారు. త్వరగా రిపోర్ట్ చేస్తే ఆర్థిక నష్టాలు జరగకుండా నిరోధించవచ్చు.
ఫోన్ కాల్స్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవద్దు. స్మార్ట్ఫోన్లో కాల్ బ్లాకింగ్ ఫీచర్లు ఆన్ చేయండి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పెద్దవారికి సైలెంట్ కాల్స్ ప్రమాదాలు గురించి చెప్పండి. అనుమానాస్పద కాల్స్ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయండి. గుర్తు తెలియని నెంబర్ల నుంచి తరచూ కాల్ చేస్తే అలర్ట్గా ఉండండి.
సైలెంట్ కాల్స్ చిన్నవిగా కనిపించినా నిజంగా ప్రమాదకరం. ఇవి సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు మొదటి అడుగు. గుర్తు తెలియని నెంబర్లు బ్లాక్ చేసి సంచార్ సాథీలో రిపోర్ట్ చేయండి. అవేర్గా ఉండి పర్సనల్ డేటాను రక్షించుకోండి. సైబర్ మోసాలను అరికట్టండి.