Space Capsule Crash| ఒక అంతరిక్ష విమానం పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవలే కూలిపోయింది. అందులో ఆశ్చర్యకరంగా గంజాయి, 166 మంది అస్తికలు (చితా భస్మం) ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. జర్మనీకి చెందిన ది ఎక్స్ప్లోరేషన్ కంపెనీ (TEC) అనే స్టార్టప్ సంస్థ జూన్ 23న “మిషన్ పాసిబుల్” పేరుతో నిక్స్ అనే అంతరిక్ష క్యాప్సూల్ను ప్రయోగించింది. ఈ క్యాప్సూల్లో 166 మంది వ్యక్తుల అస్తికలు (భస్మం), అలాగే గంజాయి విత్తనాలు, మొక్కలు ఉన్నాయి. ఈ భస్మాన్ని టెక్సాస్కు చెందిన సెలెస్టిస్ అనే అంతరిక్ష ఖనన సంస్థ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.
అంతరిక్షంలోకి చనిపోయిన వారి అస్తికలు పంపే ప్రక్రియను స్పేస్ బరియల్ అంటారు. పాశ్చాత్య దేశాల్లో ఈ సంస్కృతి ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన అంత్యక్రియ పద్ధతి. కొంతమంది వారి అంత్యక్రియలు భూమిపై కాకుండా, అంతరిక్షంలో జరగాలని కోరుకుంటారు. ఈ విధంగా వారి ముృత దేహం లేక వారి ఆస్తికలు రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది ఖరీదైన ప్రక్రియ అయినా, అనేక మంది ఖగోళ శాస్త్రజ్ఞులు లేదా అంతరిక్ష ప్రేమికులు ఇలా చేయించుకోవాలని కోరుకుంటారు. కొన్ని కంపెనీలు స్పేస్ బరియల్ సేవలు అందిస్తున్నాయి. ఇది ఆధునిక సాంకేతికతతో సాధ్యమైన కొత్త పద్ధతి.
అయితే అలా అంతరిక్ష అంతక్రియల కోసం బయలు దేరిన ఒక స్పేస్ క్యాప్సూల్ భూమి చుట్టూ అంతరిక్షంలో తిరుగుతూ కూలి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. క్యాప్సూల్ భూమి చుట్టూ రెండు సార్లు సజావుగా తిరిగింది. కానీ, భూగ్రహం గురుత్వాకర్షణను లోనై తిరిగి భూ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఒక సమస్య వచ్చింది. “ఒక అసాధారణ సమస్య కారణంగా క్యాప్సూల్ కోల్పోయింది, అది పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయి, లోపల ఉన్నవన్నీ సముద్రంలో చెదిరిపోయాయి,” అని సెలెస్టిస్ సహ వ్యవస్థాపకుడు మరియు CEO చార్లెస్ ఎం. చాఫర్ వెబ్సైట్లో తెలిపారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని, పరిశోధన జరుగుతోందని ఆయన చెప్పారు.
TEC సంస్థ ప్రకారం.. క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడింది, అంతరిక్షంలో సాధారణంగా పనిచేసింది, లాంచర్ నుండి విడిపోయిన తర్వాత స్థిరంగా ఉంది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత కమ్యూనికేషన్ స్పేస్ క్యాప్సుల్ కనెక్ట్ అయింది. కానీ, సముద్రంలో దిగే కొన్ని నిమిషాల ముందు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. క్యాప్సూల్లోని వస్తువులన్నీ తిరిగి పొందలేకపోయామని సంస్థ ధృవీకరించింది.
“మా క్లయింట్లు ఎంతో విశ్వాసంతో తమ వస్తువులను మాకు అప్పగించారు. వారందరికీ మేము క్షమాపణలు చెబుతున్నాము,” అని TEC తెలిపింది. సెలెస్టిస్ CEO చాఫర్ దీని గురించి స్పందిస్తూ.. “మా క్లయింట్ల కుటుంబాల నిరాశలో మేము కూడా భాగస్వాములం. వారి విశ్వాసానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము,” అని అన్నారు. “స్పేస్ క్యాప్సుల్ ప్రయోగం, భూమి చుట్టూ తిరగడం, నియంత్రిత రీ-ఎంట్రీ వంటి అనేక విజయాలు సాధించాము. కానీ ఇది మా మొదటి రిటర్న్ మిషన్. తప్పకుండా మా సేవలను నమ్మకంగా కొనసాగిస్తాం. క్లయింట్ల మనోభావాలను ఎటువంటి సాంకేతిక విజయం భర్తీ చేయలేదు. ఈ మిషన్ నుండి నేర్చుకున్న పాఠాలతో మళ్లీ త్వరలో ప్రయోగం చేస్తాము. TEC గతంలో నిక్స్కు ముందు ఒకే ఒక క్యాప్సూల్ను అంతరిక్షంలోకి పంపింది.” అని ఆయన చెప్పారు.
Also Read: అనంత విశ్వంలో మరో భూ గ్రహం.. 154 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త సూపర్-ఎర్త్
క్యాప్సూల్లో గంజాయి మొక్కలు, విత్తనాలు కూడా ఉన్నాయి, ఇవి మార్టియన్ గ్రో అనే సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం అంతరిక్షంలో పంపించాం. భవిష్యత్తులో మార్స్పై గంజాయి సాగు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పనిచేస్తోంది.