Cyber Attack: టాటా ఎలక్ట్రానిక్స్పై రాన్సమ్వేర్ ముఠా సైబర్ దాడికి పాల్పడింది. ఆపిల్-టెస్లా కొత్త మోడల్ కార్ల డిజైన్లకు సంబంధించి దాదాపు రెండు లక్షల ఫైళ్లను లీక్ చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హ్యాకర్లు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆపిల్ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.
దేశంలో కలకలం రేపుతున్న సైబర్ దాడులు
చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను తన హబ్గా మార్చుకోవాలని భావిస్తోంది ఆపిల్ కంపెనీ. ఈ క్రమంలో భారత్ తయారీ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్లోకి సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఐఫోన్లు-టెస్లా కార్లకు సంబంధించిన ట్రేడ్ సీక్రెట్స్ ఫైళ్లు దొంగిలించామని చెబుతోంది. దీని వెనుక వరల్డ్ లీక్స్ అనే రాన్సమ్వేర్ ముఠా ఉన్నట్లు గుర్తించారు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు.
దాదాపు 630 గిగాబైట్ల సైజు గల దాదాపు రెండు లక్షల ఫైళ్లను డార్క్ వెబ్లో అప్లోడ్ చేయడం కలకలం రేపింది. ఐ ఫోన్ సర్క్యూట్ బోర్డ్కు సంబంధించిన 52 పేజీల రహస్య డాక్యుమెంట్ ఉన్నట్లు సమాచారం. దానిపై యాపిల్ కంపెనీకి చెందిన సీక్రెట్ సమాచారమనే అధికారిక ముద్రలు కనిపిస్తున్నాయి. తమిళనాడులోని హోసూరులో టాటా ఐఫోన్ ప్లాంట్కు సంబంధించిన ఫైళ్లు బయటపడ్డాయి.
తొలుత టాటా ఎలక్ట్రానిక్స్.. ఆపిల్-టెస్లా రహస్యాలు సైతం చోరీ
దేశంలో తయారవుతున్న యాపిల్ ఐఫోన్లు దాదాపుగా టాటా ప్లాంట్ల నుంచే వస్తున్నాయట. కేవలం ఒకవంతు మాత్రమే ఫాక్స్కాన్ తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డేటా కావడంపై భద్రతాపరమైన ప్రశ్నలు మొదలయ్యాయి. టెస్లా కార్లకు సంబంధించి విడిభాగాలు సరఫరా చేస్తోంది టాటా కంపెనీ.
NV36 చార్జ్ పోర్ట్ కంట్రోలర్-నార్త్ అమెరికా అనే ఫోల్డర్ లీకైన డేటాలో కనిపించింది. టెస్లా నుంచి రాబోయే కొత్త మోడల్ Y సంబంధించినదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టెస్లా అప్గ్రేడెడ్ మోడల్ 3 ప్రాజెక్ట్ కి సంబంధించి డ్రాయింగ్స్ లీకైనట్టు మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. ఆయా ఫైళ్లపై ట్రేడ్ సీక్రెట్ అని రాసి వుంది.
ASLO READ: బెస్ట్ ఎల్జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు
సైబర్ దాడి జరిగిన మాట నిజమేనని అంగీకరించింది టాటా ఎలక్ట్రానిక్స్. కొన్ని వారాల కిందట జరిగిందని చెప్పుకొచ్చింది. కాకపోతే ఈ విషయం ఆలస్యంగా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టామని తెలిపింది. అయితే మా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం లేదని, యథావిధిగా సాగుతున్నాయని చెప్పింది.
నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై మాట్లాడేందుకు నిరాకరించింది ఆ కంపెనీ. డేటా లీక్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు యాపిల్ కంపెనీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. టెస్లా దీనిపై నోరు మెదపలేదు. సైబర్ దాడి భారత ఎలక్ట్రానిక్స్ రంగానికి గట్టి హెచ్చరిక లాంటిదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ కంపెనీల నమ్మకాన్ని నిలబెట్టాలంటే బలమైన సైబర్ సెక్యూరిటీని నిర్మించుకోవాల్సిన అవసరమని ఎంతైన ఉందని ఈ ఘటన ద్వారా నిరూపితమైంది.