Pig Butchering Scam : గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పేదలను లక్ష్యంగా చేసుకుని ఓ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్గా దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి సైబర్ మోసాలు భారీ స్థాయిలో పెరిగాయని తాజాగా కేంద్ర హోం శాఖ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ ద్వారా ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వెల్లడించింది. ఈ సైబర్ మోసాల కోసం సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను అత్యధికంగా వినియోగించుకుంటున్నారని పేర్కొంది.
పిగ్ బుచరింగ్ స్కామ్ అంటే ఏమిటి? –
ఈ పిగ్ బుచరింగ్ స్కామ్లో సైబర్ నేరగాళ్లు, తేలికగా మోసపోయే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారితో లాంగ్ టెర్మ్ రిలేషన్షిప్ను మెయిన్టెయిన్ చేస్తుంటారు. వాట్సాప్, ఫేస్బుక్, డేటింగ్ సైట్స్, మెసేజింగ్ యాప్స్ , ఈమెయిల్స్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వారితో ఎమోషనల్గా, అలానే ఫైనాన్షియల్గా బంధాన్ని ఏర్పరచుకుంటారు. అలా ఫ్రెండ్లీ స్ట్రేంజర్స్గా, రొమాంటిక్ పార్ట్నర్స్గా, ఫైనాన్షియల్ అడ్వైసర్స్గా పర్సనల్ కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా వారితో ఈ సైబర్ నేరగాళ్లు విశ్వాసం కలిగించేలా మాట్లాడుతుంటారు.
ఈ క్రమంలోనే స్టాక్స్, క్రిప్టో కరెన్సీలో లేదా మరో లాభదాయకమైన పథకం అంటూ ఫేక్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి చివరకు ఆ మొత్తాన్ని తస్కరించడం ఈ సైబర్ నేరగాళ్ల లక్ష్యం. ముందుగా జీరో రిస్క్ అంటూ, వినియోగదారుల నుంచి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, వారికి ఎక్కువ లాభం వచ్చేలా నమ్మబలికిస్తారు. దీనిని నమ్మిన వినియోగదారులు, డబ్బుకు ఆశపడి, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, సమయం చూసి ఆ మొత్తాన్ని దోచేస్తారు. దీనినే పిగ్ బుచరింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అని అంటారు.
ALSO READ : రూ.6999కే మోటో కొత్త మెుబైల్.. కిర్రాక్ ఫీచర్స్ తో జనవరి 7న లాంఛ్
పందులను చంపే ముందు, కసాయి వాడు వాటికి మంచి ఆహారం ఎలా అయితే అందిస్తాడో, ఇన్వెస్ట్మెంట్ స్కామర్స్ కూడా అలానే వినియోగదారులకు వల వేస్తారు. అందుకే ఈ పిగ్ బుచరింగ్ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. 2016లో తొలిసారిగా చైనాలో ఇలాంటి స్కామ్లు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, భారత్లో సైబర్ నేరగాళ్లు వాట్సప్ను ఉపయోగించి భారీ స్థాయిలో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. రుణాలను కూడా ఇస్తామంటూ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని వెల్లడించాయి.
ఎలా జాగ్రత్తగా ఉండాలంటే? –
కాబట్టి ఇటువంటి పిగ్ బుచరింగ్ స్కామ్స్ నుంచి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో స్ట్రేంజర్స్తో కనెక్షన్స్ మెయిన్టెయిన్ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ వారితో పర్సనల్ కనెక్షన్స్ ఉంటే, వాటి నుంచి బయట పడటమే మంచిది. వారితో కనెక్షన్ మెయిన్టెయిన్ చేసినా, గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఏ కొంచెం అనుమానంగా అనిపించినా ఫిర్యాదు చేయడం మంచిది.