WhatsApp SIM Binding: మనందరి ఫోన్లలో కచ్చితంగా ఉండే మెసేజింగ్ యాప్ వాట్సప్. చాలామంది దీని ద్వారానే ఎక్కువగా చాట్సింగ్స్ చేసుకుంటుంటారు. అయితే, ఇప్పటివరకు ఫోన్లో సిమ్ కార్డు ఉన్నా లేకపోయినా.. ఒక్కసారి లాగిన్ అయితే వైఫై సాయంతో వాట్సాప్ వాడేసేవాళ్లం. కానీ, ఇకపై ఆ ఆటలు సాగవు. భారతీయ యూజర్ల భద్రత కోసం కేంద్ర టెలికమ్ శాఖ(DoT) తీసుకొచ్చిన కొత్త నిబంధనల మేరకు.. మెటా సంస్థ ‘సిమ్ బైండింగ్’ అనే సరికొత్త ఫీచర్ను మరి కొద్దిరోజుల్లో అమల్లోకి తీసుకురానుంది. వాట్సప్ చేసే ఈ మార్పుల వల్ల కలిగే పరిణామాలేంటి? ఇదెలా పని చేస్తుంది.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.
భారత ప్రభుత్వం గత ఏడాది సైబర్ మోసాలను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ నిబంధనలను కఠినతరం చేసింది. దీని ప్రకారం.. మెసేజింగ్ యాప్లను ఉపయోగించే వారు తమ ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్లో దీనికి సంబంధించిన ఒక పాపప్ సందేశం కనిపిస్తోంది. భారతీయ నిబంధనల ప్రకారం మీ ఫోన్లో సిమ్ ఉందో లేదో తనిఖీ చేయాల్సి ఉంటుందని ఈ సందేశం స్పష్టం చేస్తోంది. కేవలం భారతదేశపు ఫోన్ నంబర్లతో (+91) వాడే ఖాతాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
Also Read: ఐక్యూ నుంచి అదిరిపోయే ఫోన్.. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, పూర్తి విరాలివే!
సాధారణంగా మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మాత్రమే ఓటీపీ కోసం సిమ్ అవసరమవుతుంది. ఆ తర్వాత సిమ్ తీసేసినా వైఫై ద్వారా యాప్ వాడుకోవచ్చు. కానీ ఈ కొత్త ఫీచర్ వస్తే అలా కుదరదు. వాట్సాప్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో రిజిస్టర్డ్ సిమ్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. ఒకవేళ మీ ఫోన్లో ఆ సిమ్ లేకపోతే, అకౌంట్ యాక్సెస్ నిలిపివేయబడుతుంది. మళ్లీ సిమ్ వేసి వెరిఫికేషన్ పూర్తి చేసే వరకు చాటింగ్ చేయడం సాధ్యం కాదన్నమాట.
ఈ నిబంధనల ప్రభావం వాట్సాప్ వెబ్ లేదా డెస్క్టాప్ వెర్షన్లపై కూడా ఉండనుంది. కొత్త రూల్స్ ప్రకారం.. ప్రతి ఆరు గంటలకోసారి డెస్క్టాప్ అకౌంట్లు ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతాయి. వినియోగదారులు మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించినా.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త విధానంపై ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ పోయినా లేదా సిమ్ పాడైనా యూజర్లు ఇబ్బంది పడతారని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే భారతీయులు అక్కడ వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా ఇండియన్ సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది కాబట్టి.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
Also Read: బడ్జెట్లో పవర్ఫుల్ ఫోన్ కావాలా? ఐకూ-వన్ప్లస్ మధ్య ఈ తేడాలు తెలిస్తే అస్సలు వదలరు!