Europe Heat: ఐరోపా ఖండం నిప్పుల కొలిమిలా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో యూరప్ లోని ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జర్మనీ, లిథువేనియా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు నానాటికీ వేడెక్కుతున్నాయి. అయితే ఈ తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మెజారిటీ ప్రజల ఇళ్లలో కనీసం ఎయిర్ కండిషనర్లు (AC) కూడా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏసీల వినియోగం భారీగా పెరిగినప్పటికీ.. యూరప్ లో మాత్రం పెద్దగా ఏసీలు లేకపోవడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
యూరప్లోని మెజారిటీ ఇళ్లు, భవనాలను కొన్ని దశాబ్దాల క్రితం నాటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. అప్పట్లో అక్కడ ఏడాది పొడవునా చలి తీవ్రత ఎక్కువగా ఉండేది. ఎండలు చాలా అరుదుగా, తక్కువ మొత్తంలో నమోదయ్యేవి. అందువల్ల ఇళ్ల లోపల వేడి బయటకు పోకుండా చలి నుంచి రక్షణ పొందేలా ‘ఇన్సులేషన్’ (Insulation) సాంకేతికతతో ఈ భవనాలను డిజైన్ చేశారు. ఇవి వేడిని లోపలే పట్టి ఉంచుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్మాణ శైలే వారికి శాపంగా మారింది. బయట ఎండలు మండిపోతుంటే ఇళ్లు ఆ వేడిని లోపలే దాచి ఉంచి ‘ఓవెన్’లా మారుస్తున్నాయి.
భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో ఏసీ అనేది ఒక అవసరంగా మారిపోయింది. కానీ యూరప్లో అలాంటి పరిస్థితి లేదు. దీనికి తోడు యూరప్లో కరెంట్ బిల్లులు చాలా ఎక్కువ. ఏసీలు వాడటం వల్ల ఆర్థికంగా భారం పడుతుందని భావించి.. ప్రజలు ఏసీలు అమర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచరు. మరోవైపు అక్కడ చారిత్రక కట్టడాలు, పాత భవనాలు ఎక్కువ. అవే తమ నగరాలకు అందాన్ని చేకూరుస్తున్నట్లు ప్రభుత్వాలు భావిస్తుంటాయి. కాబట్టి వాటి రూపురేఖలు మార్చడానికి, గోడలకు రంధ్రాలు చేసి ఏసీలు అమర్చడానికి ప్రభుత్వ అనుమతులు రావడం చాలా కష్టం. దీనికి తోడు అక్కడ ఎండ తీవ్ర కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. కొద్ది రోజుల కోసం అంత ఖర్చు పెట్టి ఏసీలు ఎందుకు? అన్న అభిప్రాయం చాలా మంది యూరోపియన్లలో ఉంది.
ప్రస్తుతం యూరప్ ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు విపరీతమైన ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏసీలు అవసరమవుతున్నాయి. మరోవైపు కోట్లాది మంది ఏసీలు వాడటం ప్రారంభిస్తే వాటి నుంచి వెలువడే గ్రీన్హౌస్ వాయువులు, వేడి వల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంటే తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తే భవిష్యత్తులో పర్యావరణం మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలను, పర్యావరణ శాస్త్రవేత్తలను సైతం వేధిస్తోంది.
Also Read: బజాజ్, ఉష, కెన్స్టార్.. రూ.8 వేల బడ్జెట్లో.. ఇల్లంతా కదిలే బెస్ట్ కూలర్లు!
ఎండల తీవ్రతను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఐరోపా దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. సాంప్రదాయ ఏసీలకు బదులుగా పర్యావరణానికి హాని చేయని ‘హీట్ పంప్స్’ (Heat Pumps) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇవి శీతాకాలంలో ఇళ్లను వేడిగా, వేసవిలో చల్లగా ఉంచుతాయి. అలాగే భవిష్యత్తులో కట్టబోయే భవనాల్లో సహజసిద్ధంగా గాలి ఆడేలా, వేడిని నిరోధించేలా కొత్త ఆర్కిటెక్చర్ డిజైన్లను తీసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా యూరప్ తనను తాను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఖాతాదారులకు భారీ షాక్.. జులైలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?