BCCI: రేపటినుండి పాకిస్తాన్ వేదికగా జరగబోతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ఇప్పటికే దుబాయ్ కి చేరుకున్న విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృశ్యా పాకిస్తాన్ లో ఆడడానికి బీసీసీఐ నిరాకరించడంతో.. ఐసీసీ భారత్ మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ వేదికగా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 20న బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు.
Also Read: Kane Williamson: న్యూజిలాండ్ కు పాకిస్తాన్ గ్రాండ్ వెల్కమ్.. ఏకంగా ఆ అమ్మాయిలతో?
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్ కి సంబంధించి బీసీసీఐ 10 కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భారత క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలీని వెంట తీసుకువెళ్లడం సహ పలు సౌకర్యాల విషయంలో కఠిన ఆంక్షలు విధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అయితే తాజాగా ఈ నిబంధన పై బీసీసీఐ యూటర్న్ తీసుకుంది.
దుబాయిలో జరిగే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులకు కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. “నో ఫ్యామిలీ రూల్” నుంచి ఆటగాళ్లకు స్వల్ప ఊరటను ఇస్తూ బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ కి ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లచ్చని బోర్డు స్పష్టం చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇందులో మరో షరతు పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ కి మాత్రమే ఇలా వెంట కుటుంబ సభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఫ్యామిలీని వెంట తీసుకువెళ్ళే విషయం గురించి ఆటగాళ్లు ముందుగానే చర్చించుకుని.. ఆ తర్వాత అభ్యర్థన చేసుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. ఇక బీసీసీఐ 10 పాయింట్ల తో కూడిన ఆదేశాల ప్రకారం.. 45 రోజులకు పైగా విదేశీ పర్యటనల సమయంలో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండడానికి ఆమోదించింది. అంతేకాకుండా ఆటగాళ్ల వ్యక్తిగత సిబ్బంది, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలపై ఆంక్షలు విధించింది.
Also Read: Morne Morkel Father Demise: ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందే టీమ్ ఇండియాలో విషాదం!
ఛాంపియన్స్ ట్రోఫీకి క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని అంతకు ముందు బీసీసీఐ వెల్లడించింది. దీనిపై ఓ సీనియర్ క్రికెటర్ నుంచి వినతి వచ్చినప్పటికీ మినహాయింపు ఇవ్వలేమని బోర్డు తెల్చి చెప్పింది. కానీ ప్రస్తుతం టోర్నీ పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని.. కేవలం ఒక్క మ్యాచ్ కి మాత్రమే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకువచ్చేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏ మ్యాచ్ కి బోర్డు ఈ మినహాయింపు ఇవ్వనుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు.