T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మాక్స్ వెల్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 బంతుల్లో 54 పరుగులతో అజేయం నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. మిచెల్ మార్ష్ 45 పరుగులతో రాణించాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్ హుల్ హక్ 3 వికెట్లు తీశాడు. ఫారుఖీ 2 వికెట్లు, ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘానిస్థాన్ గట్టిపోటీ నిచ్చింది. గుర్బాజ్ (30 పరుగులు) , నైబ్ ( 39 పరుగులు) రాణించడంతో ఒకదశలో 13 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 99 పరుగులు చేసి విజయంపై కన్నేసింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. అయితే చివరి ఓవర్లలో రషీద్ ఖాన్ చెలరేగి ఆడి ఆసీస్ కు చెమటలు పట్టించాడు. రషీద్ కేవలం 23 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో విజయానికి 4 పరుగులు దూరంలో నిచిపోయింది ఆఫ్గానిస్తాన్ జట్టు. ఆసీస్ బౌలర్లలో జంపా , హేజల్ హుడ్ రెండేసి వికెట్లు తీయగా..రిచర్డ్సన్ ఒక వికెట్ తీశాడు.
శ్రీలంకపైనే ఆశలు
ఈ టోర్నిలో ఆసీస్ 3 విజయాలు సాధించింది. మరో మ్యాచ్ లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో ఆస్ట్రేలియాకు మొత్తం 7 పాయింట్లు వచ్చాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. అయితే ఆ జట్టు రన్ రేట్ ఆసీస్ కన్నా మెరుగ్గా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయమైంది. ఇక ఈ గ్రూప్ లో చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా సెమీస్ కు చేరుతుంది. అప్పుడు ఆసీస్ ఇంటి ముఖం పడుతుంది.