Dream11 – My11Circle : భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తమ జట్ల జెర్సీ స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ లో టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిడ్లు వేస్తున్నారని.. త్వరలో స్పాన్సర్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ముఖ్యంగా డ్రీమ్ 11, మై సర్కిల్ 11కి దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టం జరిగినట్టు సమాచారం.
డ్రీమ్ 11 కి ఎంత నష్టమంటే..?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుతో డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కి భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టీమిండియా కి స్పాన్సర్ షిప్ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆసియా కప్ 2025 ప్రారంభానికి కొద్ది వారాల ముందే బీసీసీఐకి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆన్ లైన్ గేమింగ్ చట్టం కారణంగా ప్రస్తుత మెయిన్ స్పాన్సర్ డ్రీమ్ 11 ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవ్ జిత్ సైకియా ధృవీకరించారు. డ్రీమ్ 11తో ఉన్న ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నామని.. ఇకపై ఇలాంటి కంపెనీలతో స్పాన్సర్ షిప్ చేయబోమని స్పష్టం చేశారు. ఆసియా కప్ కి ముందు కొత్త స్పాన్సర్ ను ఎంపిక చేసుకోవాల్సిన సవాల్ ని ఎదుర్కొంటోంది బీసీసీఐ.
బీసీసీఐ-డ్రీమ్ 11 ఒప్పందం రద్దుకి కారణం అదేనా..?
వాస్తవానికి సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ ప్రారంభం అవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ కి రెండు వారాల ముందు బీసీసీఐ-డ్రీమ్ 11 సంస్థలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. 2023లో కుదిరిన ఈ ఒప్పందం మూడేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. అంటే 2026లో ముగియాల్సి ఉంది. కానీ కొత్త ఆన్ లైన్ గేమింగ్ చట్టం డ్రీమ్ 11 వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఆ కంపెనీ ప్రధాన ఆదాయ వనరు నిలిచిపోయింది. ఈ కారణంతోనే డ్రీమ్ 11 ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టయోటా టీమిండియా స్పాన్సర్ షిప్ కి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. జపాన్ కి చెందిన ప్రసిద్ధ కార్ల కంపెనీ టయోటా భారత జట్టుకు టైటిల్ స్పాన్సర్ గా మారాలని భావిస్తోందట. ఈ కంపెనీ భారత్ లో టయోటా కిర్లోస్కర్ జాయింట్ వెంచ్ కింద పని చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.56,500 కోట్ల కు పైగా ఆదాయం సాధించింది. ఇటీవలే టయోటా మోటార్స్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్ గా మారింది.