![cricket news today telugu cricket news today telugu](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/d7938f39968a2923bd4a9d923e3dd150.jpg)
World cup final pitch(Cricket news today telugu):
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా ఉందని, పిచ్ లపై అధ్యయనం చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రధాన టీమ్ లు ఆడిన లీగ్ మ్యాచ్ లు, రెండు సెమీ ఫైనల్స్, ఆఖరి ఫైనల్ మ్యాచ్ లు జరిగిన పిచ్ వివరాలు, వాటికిచ్చిన రేటింగ్స్ ఉన్నాయి.
140 కోట్ల మంది భారతీయులను ఉర్రూతలూగించిన టీమ్ ఇండియా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఓటమితో గాలి తీసిన బెలూన్ ల్లా అయిపోయారు. అనంతరం ఆ పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. అదే క్రమంలో రెండు సెమీఫైనల్ పిచ్ లపై కూడా విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా కివీస్ తో ఆడిన పిచ్ ను రాత్రికి రాత్రి మార్చారని కూడా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై నిజాలను నిగ్గు తేల్చడానికి, ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్ లు, ఇంకా పెద్ద దేశాల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లకు సంబంధించి పిచ్ లను అధ్యయనానికి ఐసీసీ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది.
ఈ క్రమంలో అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ పిచ్ పై యావరేజ్ అని జవగళ్ శ్రీనాథ్ రిపోర్ట్ ఇచ్చారు. అంతర్జాతీయ ఆట జరిగే స్థాయిలో పిచ్ లేదని తేల్చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ఇలాంటి పిచ్ సరికాదని అన్నారు. అయితే అవుట్ ఫీల్డ్ బాగుందని మెచ్చుకున్నారు.
కివీస్ తో జరిగిన టీమ్ ఇండియా మ్యాచ్ కి సంబంధించి ముంబై వాంఖేడి స్టేడియం పిచ్ బాగుందని రిపోర్ట్ లో తేలింది. ఇక ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన కోల్ కతా పిచ్ కూడా యావరేజ్ అని తెలిపింది. సౌతాఫ్రికా చేసిన అతి తక్కువ స్కోరు చేధించడానికి కూడా ఆస్ట్రేలియకి 47 ఓవర్లు పట్టింది. ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక్కడ కూడా అవుట్ ఫీల్డ్ బాగుందని తెలిపింది.
టీమ్ ఇండియా తాను ఆడిన 9 లీగ్ మ్యాచ్ లు, తొమ్మిది చోట్ల ఆడింది. వాటన్నింటితో పాటు, ప్రధాన జట్ల మధ్య జరిగిన పిచ్ లను ఐసీసీ రిఫరీ శ్రీనాథ్ బృందం పరిశీలించింది. చెన్నై, అహ్మదాబాద్, లఖ్ నవు, కోల్ కతా పిచ్ లన్నీ కూడా యావరేజ్ అని రాసి పారేసింది.
మనవాళ్లకి ఆట మీద, డబ్బుల మీదున్న శ్రద్ధ పిచ్ లపై లేదని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. ఈ రిపోర్ట్ పై నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మనవాళ్ల ఓటమికి మనమే కారణమయ్యామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.