Ind vs Nz Odi Series: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లోనే టీమిండియా విజయం సాధించినప్పటికీ, జట్టును గాయాలు మాత్రం వెంటాడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ఒక్కరోజు ముందుగానే రిషబ్ పంత్ గాయం బారిన పడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా నడుముపై గట్టిగా బంతి తగలడంతో, అతడు టోర్నమెంట్ కి దూరం కావాల్సి వచ్చింది. దీంతో జురెల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ వన్డే సిరీస్ ప్రారంభమైన రోజునే మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నెముకకు సంబంధించిన నొప్పి బారిన పడ్డాడు. అందుకే మొదటి మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు వేయడమే కాకుండా ఏడవ వికెట్ కు బ్యాటింగ్ చేశాడు. పరుగు తీయడానికి కూడా చాలా కష్టపడ్డాడు వాషింగ్టన్ సుందర్. దీంతో వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో ఐపిఎల్ ప్లేయర్ ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇతడు వాషింగ్టన్ సుందర్ లాగానే బ్యాటింగ్ ఆల్ రౌండర్. అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాటింగ్ అదరగొడతాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మొదటి నుంచి ఆడుతున్నాడు. ఇటీవల నాలుగు కోట్లకు ఆయుష్ బడోని ను రిటైన్ చేసుకుంది లక్నో. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయగల ఈ కుర్రాడు.. తన ఐపీఎల్ లో ఇప్పటివరకు 56 మ్యాచ్ లు ఆడడం జరిగింది. ఇందులో మొత్తం 963 పరుగులు చేయగా ఆరు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే అతని రికార్డు పెద్దగా ప్రభావవంతంగా చూపించడం లేదు. కానీ బీసీసీఐ ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేసింది.
ఆయుష్ బడోనిని సెలక్షన్ వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాలిటిక్స్ నడిపించాడని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. టీమిండియాలో ఛాన్స్ కోసం యంగ్ స్టార్లందరూ పోటీపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చేందుకు రుతురాజ్, అక్షర్ పటేల్, సంజు, హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్, పడిక్కల్, రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్లు చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్లు అద్భుతమైన ఫామ్ లో కూడా ఉన్నారు. కానీ అనామక ఆయుష్ బడోని పేరును తెరపైకి తీసుకువచ్చింది గౌతమ్ గంభీర్ అని తెలుస్తోంది.
గతంలో లక్నో జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ పనిచేశాడు. అందుకే ఆ జట్టుకు చెందిన ఆయుష్ ను తెరపైకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. గంభీర్ కు నచ్చిన వాళ్లకే టీమ్ ఇండియాలో అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇప్పుడు ఆయుష్ ను తీసుకురావడంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మొన్నటి వరకు హర్షిత్, గిల్ ను నెత్తిన పెట్టుకున్న గంభీర్ ఇప్పుడు ఆయుష్ బడోనిని తీసుకువచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.