India vs England : యువ సంచలనం యశస్వి జైశ్వాల్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించి.. టీమ్ ఇండియా పరువు నిలబెట్టాడు. లేకపోతే మొదటి టెస్ట్ కన్నా ఘోరంగా దెబ్బతినేదని క్రీడా విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు. ఎందుకంటే టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇందులో యశస్వి చేసినవే 209 పరుగులున్నాయి. మొత్తం జట్టు సభ్యులు అందరూ కలిపి 187 పరుగులు మాత్రమే చేశారు. వీరిలో అతిరథ మహారథులెంతో మంది వెన్నుచూపితే, యశస్వి ఒక్కడూ ఒంటరి పోరాటం చేశాడు.
యశస్వి తర్వాత టీమ్ ఇండియాలో హయ్యస్ట్ స్కోరు ఎవరంటే 34 పరుగులతో శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ఇది కూడా ఒక రికార్డుగానే చెబుతున్నారు. ఎందుకంటే 2005లో అడిలైడ్ వేదికగా వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో బ్రయాన్ లారా 226 పరుగులు చేశాడు. మొత్తమ్మీద వెస్టిండీస్ 405 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్ లో తన తర్వాత అత్యధిక స్కోరు బ్రావో చేసిన 34 పరుగులే కావడం గమనార్హం. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత లారా రికార్డును జైస్వాల్ సాధించాడు.
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో పలు ఆసక్తికర కామెంట్లు వినిపిస్తున్నాయి. నెట్టింట పలువురు ప్రముఖులు యశస్విని ప్రశంసిస్తున్నారు. సచిన్ టెండుల్కర్ అయితే తెగ ముచ్చటపడ్డాడు. యశస్వీ భవ, జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసించాడు. రాబోయే కాలంలో కాబోయే సూపర్ స్టార్ అంటూ మరికొందరు చెబుతున్నారు. ఇది జైస్వాల్-ఇంగ్లండ్ పోరుగా మారిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరైతే మహేష్ బాబు పాటను కోట్ చేస్తున్నారు. నిండు చందురుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అని చెబుతున్నారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో యశస్వి ఒకవైపు, మిగిలిన క్రికెటర్లందరూ ఒకవైపు… అని ఆ పాటను కోట్ చేస్తున్నారు. యశస్విని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే సీనియర్లు మాత్రం, ఇంక ఆపండి, తను కుర్రాడు…ఎక్కువ పొగిడితే పాడైపోతాడని నెటిజన్లకు చురకలు వేస్తున్నారు.