Krishnamachari Srikanth: 2026 టి-20 ప్రపంచ కప్ కి సంబంధించి 15 మందితో కూడిన టీమ్ ఇండియా జట్టును సెలెక్టర్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు అనుకున్న విధంగానే ఉంటుందని భావించినా.. ఓ అనూహ్య నిర్ణయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే.. టీమిండియా స్టార్ ఓపెనర్, కాబోయే మూడు ఫార్మాట్ల కెప్టెన్ గా భావించిన శుభ్ మన్ గిల్ కి బిసిసిఐ ఊహించని షాక్ ఇచ్చింది.
Also Read: U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్
2026 టి-20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో ఇతడికి చోటు దక్కలేదు. ఏకంగా వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఇతడిని జట్టు నుంచే తప్పించడం క్రికెట్ వర్గాలలో పెను సంచలనంగా మారింది. ఇతడి స్థానంలో సంజు శాంసన్ ని ఓపెనర్ గా, ఇషాన్ కిషన్ ని బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు.
మొన్నటి వరకు టి-20 ఫార్మాట్ కి వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ని.. 2026 టి-20 ప్రపంచ కప్ కి పక్కన పెట్టడంతో తాను షాక్ గురయ్యానని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదన్నాడు. “గిల్ ని తొలగిస్తారని నేను అసలు ఊహించలేదు. ఈ వార్త విని ఆశ్చర్యపోయాను. ఇది అద్భుతమైన సెలక్షన్. మొదట గిల్ ని వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతడు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. వన్డేలలో గిల్ గొప్ప ఆటగాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే ఇంగ్లాండ్ లో భారీగా పరుగులు చేశాడు. కానీ టి-20లలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లతో పోలిస్తే గిల్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. దేశవాళీ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ని ఎంపిక చేయడం మంచి విషయం. అలాగే రింకు సింగ్ ని కూడా జట్టులోకి తీసుకున్నారు. మొత్తానికి సెలక్షన్ కమిటీ అద్భుతమైన జట్టును ఎంపిక చేసింది. అభిషేక్ శర్మ, సంజు ఓపెనింగ్ చేస్తారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్” అని చెప్పుకొచ్చాడు.
Also Read: Shahid Afridi: ఇండియాను నిద్రలేకుండా చేసారు.. మీరు రియల్ హీరోలు రా !
డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం పంజాబ్ ఇప్పటికే 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో గిల్ కి అవకాశం కల్పించారు. పంజాబ్ జట్టు తమ 7 లీగ్ దశ మ్యాచ్ లను జైపూర్ లో ఆడబోతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, సిక్కిం, ఛత్తీస్గడ్, ముంబైలతో తలపడనుంది. ఈ మ్యాచ్ లు జనవరి 8న ముగుస్తాయి. ఇక జనవరి 11 నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ వన్డే సిరీస్ కి సంబంధించిన జట్టును ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సిరీస్ లో గిల్ ఎంపిక అయితే.. విజయ్ హజారే ట్రోఫీలో ఎన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడో వేచి చూడాలి.