Mumbai Indians vs Sunrisers Hyderabad IPL 2024 Highlights: ఐపీఎల్ సీజన్ 2024లో సంచలనాలకు హైదరాబాద్ సన్ రైజర్స్ తెరతీసింది. నిజానికి బ్రహ్మండమైన స్కోర్లు చేసి ఐపీఎల్ రికార్డులు స్రష్టించింది. అలాంటి జట్టు నేడు ముంబైతో ఆడుతూ చేతులెత్తేసింది. ఒకదశలో విజయం సాధిస్తుందనుకున్న హైదరాబాద్ కి సూర్యకుమార్ అడ్డంగా నిలబడిపోయాడు. సెంచరీ చేసి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అలాగే ఐపీఎల్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు.
టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది. ఈ గెలుపుతో కొంచెం పరువు నిలబెట్టుకుంది. అట్టడుగు పదో స్థానం నుంచి కొంచెం పైకి అంటే 9వ స్థానంలోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే…174 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కి ఆదిలోనే ధనాధన్ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4) ఇద్దరూ తక్కువ స్కోరుకి అవుట్ అయిపోయారు. సరేలే అనుకునే లోపు ఫస్ట్ డౌన్ వచ్చిన నమన్ ధర్ డక్ అవుట్ అయిపోయాడు.
Also Read: ధోనీ అలా వచ్చేటట్టయితే.. ఆడకపోవడమే బెస్ట్: హర్భజన్
దీంతో ముంబై ఇండియన్స్ కి ఘోర పరాజయం తప్పదని అంతా అనుకున్నారు. ఎందుకంటే 4.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 31 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయంది. ఈ సమయంలో వచ్చిన సూర్యకుమార్ నెమ్మదిగా ఆడుతూ, సరిగ్గా 10 వ ఓవర్ తర్వాత గేర్ మార్చాడు. ఇంక మామూలుగా ఆడలేదు.
ఆ బౌలర్, ఈ బౌలర్ అని లేదు అందరికీ రేవు ఎట్టేశాడు. సరిగ్గా 17.2 ఓవర్ వచ్చేసరికి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో 6 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి తిలక్ వర్మ (37) సపోర్ట్ గా నిలిచాడు.
హైదరాబాద్ బౌలింగులో భువనేశ్వర్ 1, మార్కో జాన్సన్ 1, కమిన్స్ 1 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ కి శుభారంభం దక్కలేదు. కీలకమైన ఆటగాడు అభిషేక్ శర్మ (11) త్వరగా అయిపోయాడు. తర్వాత మయాంక్ అగర్వాల్ (5) అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ (20) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
తన తర్వాత ఎవరూ పెద్దగా ఆడలేదు. హెన్రిచ్ క్లాసిన్ (2), మార్కో జాన్సన్ (17), షబాజ్ అహ్మద్ (10), అబ్దుల్ సమద్ (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక చివర్లో కెప్టెన్ కమిన్స్ 17 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందువల్ల ఆ మాత్రం 173 పరుగులైనా హైదరాబాద్ చేసింది.
ముంబై బౌలింగులో బుమ్రా 1, పియూష్ చావ్లా 3, పాండ్యా 3, అంశుల్ కంబోజ్ 1 వికెట్ పడగొట్టారు.