“Better To Include A Fast Bowler Than Playing MS Dhoni” Harbhajan Singh: మహేంద్రసింగ్ ధోనీ.. టీమ్ ఇండియా పెను సంచలనం.. అపజయాల బాట నుంచి విజయాల బాటవైపు టీమ్ ఇండియాని నడిపించినవాడు. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు. ఈ రోజు టీమ్ఇండియా క్రికెట్ ఇలా పటిష్టంగా ఉందంటే, ఆరోజు ధోనీ వేసిన దారులు, నేర్పిన నడకలు, చూపిన మార్గమే కారణమని చెప్పాలి.
ముఖ్యంగా ధోనీని అందరూ ఎందుకు ఇష్టపడతారంటే, తన వ్యక్తిగత రికార్డుల కోసం ఏనాడు ఆడలేదు. అదే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా జరిగింది. అప్పటికి సీఎస్కే స్కోరు చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో వికెట్లు ఠపీఠపీమని పడిపోతున్నాయి. ఈ సమయంలో 6 లేదా 7 వ నంబర్ బ్యాటర్ గా రావల్సిన ధోనీ, చివర్లో 9వ నెంబర్ బ్యాటర్ గా వచ్చాడు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: టీ 20 ప్రపంచకప్ నకు.. ఉగ్రవాద ముప్పు?
పోనీ వచ్చి ఆడాడా అంటే అదీ లేదు. రాగానే హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీకీ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ స్పందించాడు. ఆ స్థానంలో ధోనీ బ్యాటింగ్కు రావడం కంటే జట్టు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని చాలా తీవ్రంగా స్పందించాడు. తన బదులు మరొక ఆటగాడు రావచ్చు లేదా మరో ఫాస్ట్ బౌలర్కు అవకాశం ఇవ్వవచ్చు. దానివల్ల జట్టు పటిష్టంగా మారుతుందని అన్నాడు. అయితే ధోనీ కంటే ముందుగా శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్కు రావడంపై భజ్జీ ఆశ్చర్యపోయాడు.
సీఎస్కే జట్టులో ధోనీకి తిరుగులేదు. తన మాటకు ఎదురులేదు. జట్టు ప్రయోజనాలపై ఎంతగానో ఆలోచించే ధోనీ, ఎందుకిలా చేశాడని అంతా అనుకుంటున్నారు. పోనీ జట్టు స్కోరు ఏమైనా ఘనంగా ఉంది, అందుకే లేట్ గా వచ్చాడని అనుకోవడానికి లేదు. చాలా తక్కువ స్కోరులో జట్టు వెళుతున్నప్పుడు ధోనీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లకు తను భలే పని పెట్టాడని అందరూ అంటున్నారు.
పోనీ ఆలస్యంగా వచ్చి, ఏమైనా రెండు సిక్స్ లు కొట్టాడంటే, అది కూడా లేదు. గోల్డెన్ డక్ అవుట్ అయిపోయాడు. శార్దూల్ ఠాకూర్ కూడా ప్రమోషన్ పై వచ్చి 11 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ధోనీ రిటైర్ అవుతున్నాడు. అందుకే ఇప్పటి నుంచి తను లేని లోటును వేరే వాళ్లతో భర్తీ చేసేందుకు ఇలా చేస్తున్నాడని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ధోనీ ఉన్నాడు. అంతా చూసుకుంటాడనే భావన నుంచి జట్టు బయటపడాలనే ఉద్దేశంతో తను ఆఖరును వచ్చాడని కొందరు విశ్లేషిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత సచిన్ లా.. తను కూడా సీఎస్కే కి బహుశా మెంటర్ గా ఉండే అవకాశాలున్నాయి.