Rahul gandhi comments on NDA(Politics news today India): లోక్సభ ఎన్నికలకు అంచెలంచెలుగా పోలింగ్ జరుగుతుండడంతో ముఖ్యనేతల్లో టెన్షన్ మొదలైంది. తాము గెలుస్తామంటే.. లేదు తామే గెలుస్తామని పైకి ధీమాగా చెబుతున్నారు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. అంతేకాదు తాము అధికారం లోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ విషయంలో మోదీ కంటే రాహుల్గాంధీ ఓ అడుగు ముందే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 150 సీట్లు రావడం కష్టమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్నారని, అందుకే 400 పైచిలుకు సీట్లు రావాలనే నినాదాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. వాళ్లకు 400 సీట్లు పక్కనబెడితే 150 స్థానాలు గెలుచు కోవడం కష్టమన్నారు యువనేత. దళితులు, బీసీలకు ప్రయోజనాలను కల్పించింది రాజ్యాంగమేనని, వీళ్ల హక్కులను మోదీ తీసుకోవాలని భావిస్తున్నట్లు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం మించి రిజర్వేషన్లు పెంచుతామని క్లారిటీ ఇచ్చేశారు యువనేత. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేలా కాంగ్రెస్ సర్కార్ చూస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలకూ ప్రయోజనం కలిగేలా తాము పని చేస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే వేతనాలను పెంచడంతోపాటు రైతు రుణాలు మాఫీ చేస్తామని కుండబద్దలు కొట్టేశారు.
మధ్యప్రదేశ్లోని రత్లాం ఝాబువా లోక్సభ పరిధిలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరై ప్రసంగించారు. అంతేకాదు కుల గణన ఆవశ్యకతను ఆయన మరోసారి గుర్తుచేశారు. కులగణన చేస్తేనే ప్రజల స్థితిగతులు ఏమిటన్నది బయటపడుతుందని, అది దేశ రాజకీయాల దిశను మారుస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కావని, పార్టీల మధ్య పోరుకాదన్నారు. రాజ్యాంగాన్ని- ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నమని, మీరు లేకుండా పార్టీ విజయం సాధించడం కష్టమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.
ALSO READ: మూడోదశ లోక్ సభ ఎన్నికలు.. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్
ఇప్పటికైతే రెండు దశల పోలింగ్ జరిగింది. ఇవాళ మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో నాలుగు దశలు పెండింగ్లో ఉన్నాయి. మరి వీటిలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి.