![Under-19 Asia Cup](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/26e28caed5bfb1f1db8b279c4ab47013.jpg)
Under-19 Asia Cup : టీమ్ ఇండియా సీనియర్లు సిరీస్ లు ఓడిపోయినా, పాక్ తో మాత్రం రెట్టింపు కసితో ఆడతారు. ఎందుకంటే దాయాదుల పోరు అంటే రెండు వైపులా ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు మనసు పెట్టే ఆడతారు. ఆ విషయం తెలిసి కూడా అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కుర్రాళ్లు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు, దారుణమైన బౌలింగ్ కారణంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక భారత్ సెమీఫైనల్ చేరాలంటే, డిసెంబర్ 12న నేపాల్ తో జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ లో ఓడితే యువ భారత్ ఆశలు అడియాశలవుతాయి. దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో భారత్- నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. కెప్టెన్ ఉదయ్ (60), ఓపెనర్ ఆదర్శ్ (62), సచిన్ దిహాస్ (58) అర్థ శతకాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (24), రుద్రపటేల్(1) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. అప్పటికి 46 పరుగులకి 2 వికెట్లతో ముందుకెళ్లింది. కీలకమైన వికెట్లు పడటంతో ఆత్మ విశ్వాసం లోపించింది. ముగ్గురు తప్ప ఎవరూ కూడా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేదు.
చివరికి క్రీజులో కుదురుకున్నాడని భావించిన ఆదర్శ్ సింగ్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్(2), కీపర్ అరవెల్లీ అవనిష్ (11) కూడా వెంటనే పెవిలియన్ చేరారు. ఈ పరిస్థితుల్లో సచిన్ ధాస్తో కలిసి ఉదయ్ సహరణ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరో వికెట్కు 46 పరుగులు జోడించిన అనంతరం భారత కెప్టెన్ అవుట్ అయ్యాడు.
ఇక చివర్లో బ్యాటింగ్కు దిగిన మురుగణ్ అభిషేక్(4), రాజ్ లింబాని (7) కూడా వెనుదిరిగారు. ఒంటరిగా మిగిలిన సచిన్ దాస్ చేసేది లేక భారీ షాట్ కొట్టి.. చివరి ఓవర్లో వెనుదిరిగాడు. సౌమి పాండే (8 నాటౌట్), నమన్ తీవారీ (2 నాటౌట్) మరో వికెట్ పడకుండా, మిగిలిన 5 బాల్స్ జాగ్రత్తగా ఆడి భారత ఇన్నింగ్స్ను ముగించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ కూడా భారత్ లాగే 47 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత మన బౌలర్లు చేతులెత్తేశారు. ఎంతమంది బౌలర్లను మార్చినా పాకిస్తాన్ బ్యాటర్ల ఆట కట్టించలేక పోయారు. చివరికి ఓటమి పాలయ్యారు.
పాక్ బ్యాటర్ అజాన్ అవైస్ (105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. సాద్ బైగ్ (68 నాటౌట్) కలిసి మరో వికెట్ పడకుండా లక్ష్యం దిశగా తీసుకువెళ్లారు. భారత బౌలర్లలో మురుగణ్ అభిషేక్(2/55) ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.