IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా నేడు అదిరిపోయే రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో ఈ రోజంతా క్రికెట్ ఫ్యాన్స్ చూసినోళ్లకు చూసినంత ఎంజాయ్. రెండు మ్యాచ్ లు వేర్వేరు చోట్ల.. వేరువేరు సమయాలలో జరుగుతున్నందున క్రికెట్ అభిమానులు తనివితీరా మైదానంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసే వీలుంది. మొదటి మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ – కలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది.
ఇక రెండవ మ్యాచ్ చండీఘడ్ లో చెన్నై సూపర్ కింగ్స్ – పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే మంగళవారం రోజు రెండు మ్యాచ్ లు ఎందుకంటే..? ఈ 18వ సీజన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. కలకత్తా నైట్ రైడర్స్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 ఆదివారం రోజున ఈడెన్ గార్డెన్స్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సింది.
కానీ అదే రోజున శ్రీరామనవమి వేడుకలు జరగడంతో అటు శ్రీరాముడి శోభాయాత్ర, ఇటు మ్యాచ్ కి పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది. దీంతో కలకత్తా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కి లేఖ రాశారు. దయచేసి మ్యాచ్ తేదీ మార్చాలని లేఖలో కోరారు. దీంతో ఆరోజు జరగాల్సిన మ్యాచ్ ని ఏప్రిల్ 8 {నేటికీ} వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజు {నేడు} రెండు మ్యాచ్లు జరగనున్నాయి.
ఇక ఈరోజు జరగబోయే రెండు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ అయిన కలకత్తా – లక్నో గురించి మాట్లాడుకుంటే.. ఈ ఇరుజట్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ ఇరుజట్లు ఇప్పటివరకు రెండు మ్యాచ్లలో గెలిచి.. మరో రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూశాయి. ఇటువంటి పరిస్థితిలో ఉత్కంఠ మ్యాచ్ చూడవచ్చు. కలకత్తా తరఫున ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డికాక్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఇక లక్నోలో కూడా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ ఇరుజట్లు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడగా.. ఇందులో కలకత్తా రెండు మ్యాచ్ లు, లక్నో మూడు మ్యాచ్లలో గెలుపొందింది. ఇక రెండవ మ్యాచ్ పంజాబ్ – చెన్నై మధ్య ఉంది. పంజాబ్ జట్టు తన సొంత మైదానంలో వరుసగా రెండవ మ్యాచ్ ఆడబోతోంది. చివరి మ్యాచ్ లో ఇక్కడ ఓటమిని ఎదుర్కొంది పంజాబ్. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా గెలుపొందాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి గెలుపు బాట పట్టాలని కోరుకుంటుంది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ – చెన్నై మధ్య జరిగిన అన్ని మ్యాచ్లలో చెన్నై ఆదిక్యంలో ఉంది. ఈ ఇరుజట్లు మొత్తం 30 మ్యాచ్లలో తలపడగా.. చెన్నై 16 మ్యాచ్లలో, పంజాబ్ 14 మ్యాచ్లలో గెలుపొందాయి. అయితే ఈరోజు జరగబోయే రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ లో సొంత మైదానంలో కలకత్తాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై ఆధిపత్యం చలయించే అవకాశం ఉంది. అయితే చెన్నై ఈరోజైనా గెలుస్తుందా..? అన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఈరోజు జరగబోయే ఈ రెండు ఆసక్తికర మ్యాచ్లలో ఏ జట్లు గెలుపొందుతాయో వేచి చూడాలి.