Tribal Encroachment: ఆలస్యంగా వెలుగులోకి సంచలన నిజాలు – 20ఎకరాలపై వివావాదం
• ఎస్టీ కమిషన్ ఆదేశాలు – సబ్ కలెక్టర్ కల్లూరు విచారణ
• ఒకే సర్వే నెంబర్తో రెండు గ్రామాల్లో మోసం – ఎల్టీఆర్ కేసు తాలుకా భూములపై అక్రమ యత్నం
సత్తుపల్లి, స్వేచ్ఛ: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో గిరిజనులకు కేటాయించిన ఎల్టీఆర్ కేసు తాలుకా భూములపై జరుగుతున్న అక్రమ కబ్జా వ్యవహారం భారీ సంచలనంగా మారింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ కల్లూరు సూచనలతో సత్తుపల్లి మండల తహసీల్దార్ జరిపిన విచారణలో ఆశ్చర్యకర నిజాలు వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ గ్రామానికి చెందిన గిరిజనులు ఆరోపిస్తున్నదేమిటంటే, సాటి గిరిజనుడైన గుండి వీరభద్రం యాతాలకుంట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 54లో సుమారు 20 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నాడనీ, ఈ భూమి ఇప్పటికే ఎల్టీఆర్ కేసు నెం. 672/2021 (ఎస్పిఎల్-2) కింద గిరిజనులకు కేటాయించబడినదని అధికార రికార్డులే స్పష్టంగా తెలియజేస్తున్నప్పటికీ ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశాడనీ గ్రామ గిరిజనులు వాపోతున్నారు.
పక్కనే ఉన్న అన్నపూరెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన అదే సర్వే నెంబర్ (54)ను అడ్డం పెట్టుకొని, పాత కేసుల పత్రాలను చూపిస్తూ యాతాలకుంట గ్రామ భూములపై హక్కుల పేరుతో గందరగోళం సృష్టించినట్లు విచారణలో తేలింది. రెండు వేర్వేరు రెవెన్యూ గ్రామాలకు చెందిన భూములను ఒకే సర్వే నెంబర్ పేరిట చూపించడం ద్వారా అధికారులను తప్పుదోవ పట్టించినట్లు స్పష్టమైంది.
Also Read: హైదరాబాద్లో ఇంధన కొరత.. రంగంలోకి జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ
గుండి వీరభద్రం స్వయంగా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు ఆదేశాలు ఇవ్వగా, కల్లూరు ఉప కలెక్టర్ సూచనల మేరకు సత్తుపల్లి తహసీల్దార్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలోనే ఆయన స్వయంగా వివాదాస్పద భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న విషయం బయటపడటం సంచలనం రేపుతోంది.
అన్నపూరెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 52, 53, 54లపై ఇప్పటికే పలు న్యాయపరమైన వివాదాలు నమోదయ్యాయి. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో డబ్ల్యూ.పీ. నెం. 18686/2008, డబ్ల్యూ.పీ. నెం. 293/2014 కేసులు నమోదుకాగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో హెచ్ఆర్సి నెం. 1664/2020 కేసు కూడా విచారణకు వెళ్లింది. ఈ కేసులపై జరిగిన సమగ్ర విచారణల్లో రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశీలించి, ఆ భూములు అన్నపూరెడ్డిపల్లి మండలం పరిధిలోనే ఉన్నాయని నిర్ధారించాయి.
అదే పాత రికార్డులను అడ్డంగా ఉపయోగించి యాతాలకుంట గ్రామంలో కొత్తగా హక్కుల పేరుతో వివాదం రేకెత్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ అధికారుల పంచనామాలు కూడా ఎల్టీఆర్ భూముల అసలు స్థితిని స్పష్టం చేస్తున్నప్పటికీ, అక్రమ కబ్జా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Resad: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..? మోదీ సర్కార్ సంచలన ప్రకటన
పలుమార్లు సత్తుపల్లి తహసీల్దార్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆరోపిస్తూ ఇదే గ్రామానికి చెందిన గిరిజన యువ నాయకుడు తాటి రామకృష్ణ ఆధ్వర్యంలో గిరిజనులు సత్తుపల్లి తహసీల్దార్ కు అధికారిక నివేదిక సమర్పిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
• కబ్జాకు గురైన ఆ 20ఎకరాల భూమినీ తక్షణమే స్వాధీనం చేసుకోవాలి
• భూమిలేని గిరిజనులకు ఆ భూమిని పంచాలి
• బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి
ఒకే సర్వే నెంబర్ను ఆయుధంగా మార్చుకుని సాటి గిరిజనుల హక్కులను కంచె చేను మేసిన చందంగా గిరిజనుడైన గుండి వీరభద్రం దోచుకునే ఈ కబ్జా బాగోతం భూమి రికార్డుల వ్యవస్థలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే, గిరిజన భూములపై ఇలాంటి అక్రమాలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Also Read: పోలీసులకే సవాల్.. అందరూ చూస్తుండగానే బ్యాంకును ఊడ్చేశారు!