Addanki Dayakar: భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రిని మరియు సభాపతిని అవమానపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కేవలం రాజకీయ నాటకాలు వేయడమే కాకుండా, ఇతరులతో నాటకాలు వేయిస్తూ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు.
శాసనసభాపతిని ‘ధృతరాష్ట్రుడి’తో పోల్చడం ఏ రకమైన సంస్కారమని, సభలో ఒక సభ్యుడిగా ఉండి సభాపతిని కించపరచడం దుర్మార్గమని మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముందు పెట్టుకుని రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న వ్యక్తులపై అహంభావ పూరిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ కే చెల్లుతుందని దయాకర్ ఎద్దేవా చేశారు.
గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడారని, ఇప్పుడు కేటీఆర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అవమానిస్తున్నారని దయాకర్ ఆరోపించారు. ఒకప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు కేటీఆర్ను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ విలువల పట్ల గౌరవం లేని ఇటువంటి ధోరణి వల్లే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేశారని, అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నారని, ఆనాడు కవిత చెప్పినట్లు ‘కర్మ రిటర్న్స్’ అన్న చందంగానే నేడు వారి పరిస్థితి ఉందని చురకలు అంటించారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగ వ్యవస్థలను గానీ, వ్యక్తులను గానీ అవమానించే చర్యలకు పాల్పడలేదని దయాకర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరును తెలుగు సమాజం మొత్తం గమనిస్తోందని, ఇటువంటి అగౌరవ ప్రసంగాలకు ప్రజలే మళ్లీ బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేటీఆర్ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని, సభాపతికి మరియు ముఖ్యమంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన విపక్షంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం తెలంగాణకు నష్టదాయకమని ఆయన హితవు పలికారు.
Read Also: Kodandaram: కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత.. మున్సిపల్ పొత్తుపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు