DGP Shivadhar Reddy; త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీజీపీ కార్యాలయంలో వేర్వేరు జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. 2027, జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నది ప్రవహిస్తున్న జిల్లాల పోలీసు అధికారులు ఇప్పటి నుంచే పుష్కర పనులపై దృష్టి సారించాలని చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి గోదావరి పుష్కరాల సమయంలో ఉమ్మడి జిల్లాలు ఉండేవని, ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన దృష్ట్యా క్షేత్రస్థాయిలో పనులపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలన్నారు. ఇటీవలి మేడారం జాతరలో వినియోగించిన సాంకేతిక నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ పుష్కరాల్లోనూ సమర్థంగా ఉపయోగించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని భద్రత ఏర్పాట్ల కోసం ఈసారి అత్యాధునిక టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించాలని చెప్పారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ, వాహన నంబర్లను గుర్తించే ఏఎన్పీఆర్ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
Also Read: Vivo Y05: వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. 6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్.. రూ.10k కంటే తక్కువ ధరలో
రద్దీని పర్యవేక్షించేందుకు వీడియో అనలిటిక్స్, హీట్ మ్యాప్స్ వంటి సాంకేతికతను జోడించాలన్నారు, స్టేట్ లెవల్ రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని చెప్పార ప్రయాగ్ రాజ్, నాసిక్ కుంభమేళాల తరహాలో వేలాది కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా యూనిఫైడ్ మొబైల్ యాప్, డిజిటల్ డిస్ ప్లే బోర్డులను పెట్టాలని చెప్పారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్, ఫైర్ వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ గోదావరి నది ప్రవహిస్తున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అధికారులు పనులను ప్రారంభించాలన్నారు. నది నీటి నాణ్యతను, గాలి, శబ్ద కాలుష్యాన్ని ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి నాణ్యత పర్యవేక్షణ, స్మార్ట్ బిన్స్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ కలిగిన పారిశుద్ధ్య వాహనాలు, తాత్కాలిక సోలార్ గ్రిడ్ వంటివి ఈ పుష్కరాల ప్రత్యేకత కానున్నాయన్నారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఐజీపీలు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్, శాంతి భద్రతల ఏఐజీ రమణ కుమార్, వేర్వేరు జిల్లాల ఎస్పీలు , కమిషనర్లు, ఎండోమెంట్ శాఖాధికారులు పాల్గొన్నారు.
Also Read: TG ARSK Centers: రాష్ట్రంలో ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా.. విచ్చలవిడిగా కొనసాగుతున్న యూరియా దందా..!