Advocate Murder: స్వేచ్ఛ బ్యూరో: సంచలనం సృష్టించిన అడ్వకేట్ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధాన నిందితుడు కవాడీగూడకు చెందిన వినయ్ అని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నివాసముంటున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను శనివారం దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా సీసీ కెమెరాల ఫుటేజీతో నిర్ధారణ అయ్యింది.
పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు
లభించిన ఆధారాలతో నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు నలుగురిని కల్వకుర్తి, గోవా ప్రాంతాల నుంచి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కవాడీగూడకు చెందిన వినయ్ తన కారుతో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ ను సహచరులతో కలిసి ఢీకొట్టి హత్య చేసినట్టుగా వెల్లడైంది. కాగా, మలక్ పేటలోని వక్ఫ్ బోర్డు భూముల విషయంలో ఆలం ఖాన్ అనే వ్యక్తి తన తండ్రిని హత్య చేయించినట్టుగా ఖాజా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆబిడ్స్ ఏసీపీ కార్యాలయంలో వివరణ
ఈ క్రమంలో ఊటీలో ఉన్న ఆలం ఖాన్ ను పోలీసులు ఆదివారం పోలీసులు నగరానికి రప్పించారు. ఆబిడ్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను విచారించారు. ఆ తరువాత వక్ఫ్ బోర్డు భూముల విషయంలో ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్ లు తన తండ్రిని హత్య చేయించటానికి గతంలో కూడా ప్రయత్నించినట్టు ఫర్హాన్ ఇచ్చిన ఫిర్యాదుపై వారిరువురిపై నాంపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హత్యకు ముందు జరిగిన వివాదాలు, బెదిరింపులపై ఆరా తీస్తున్నారు.
పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే..
నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఫర్హాన్ లు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన తండ్రి హత్యలో ఉన్న అసలు సూత్రధారులను చట్టపరంగా శిక్షించాలని ఫర్హాన్ డిమాండ్ చేశారు. ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్ లు తమ అనుచరులతో తన తండ్రిని హత్య చేయించారని ఆరోపించారు. ఫర్హాన్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరోసారి తన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారని చెప్పారు. హత్య కేసు నిందితులకు పోలీసులు మర్యాదలు చేస్తున్నారని ఆరోపించారు. ఏసీ గదుల్లో కూర్చొని నిందితులు ఫోన్లు మాట్లాడుతున్నారని చెప్పారు.
పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే నినాదాలు
అసలు నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండుకు తరలించాలన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు భూముల కోసం పోరాటం చేస్తున్న అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ ను కుట్ర ప్రకారం హత్య చేశారన్నారు.
Also Read: పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి