Palamuru Project: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పి పాలమూరు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అయితే, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామన్నారు.
పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర వ్యాఖ్యలు
పాలమూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయకపోతే ఏ నాయకుడైనా జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినట్టే అని చెప్పారు. కేసీఆర్ కు అడ్రస్ లేకపోయినా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడని నమ్మి గెలిపించారని, కానీ కేవలం తమ అవినీతి కోసం ఈ ప్రాజెక్టును వాడుకున్నారని ఆరోపించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 స్టేజీలు నీళ్లు దిగుమతి చేసుకుంటామంటూ కేవలం 18 స్టేజీలకు పరిమితం చేశారని తెలిపారు. ప్రాజెక్టుకు 58 వేల కోట్లు మంజూరైతే కేవలం 28 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా సంక్షేమం విషయంలో ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందని, చివరికి తాము తప్పు చేసినా ప్రశ్నించాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో శంకర్ తో కలిసి సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి అనుకున్నది సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తాం
బోర్లు వేసినా చుక్క నీరు రాని స్థితిలో ఉన్న పాలమూరుకు ప్రాజెక్టు అవసరం ఎంతగానో ఉందన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టరేట్లలో సమావేశాల అనంతరం చర్చించి ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ నిర్వహించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఈ విషయంలో వీర్లపల్లి శంకర్ పట్టుదలతో ఉన్నాడని, సీఎం కూడా దీనిని వదిలిపెట్టడని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతి లేకుండా, భూసేకరణ లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని గత ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. కాలేశ్వరం కోసం కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం పాలమూరును ఎందుకు విస్మరించిందో యువత ప్రశ్నించాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కొత్త విడతపై కీలక ప్రకటన
జనగణన, కులగణన కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే పింకు మీడియా తమపై దుష్ప్రచారాలు చేస్తోందని, ఇలాంటివి నమ్మవద్దని చెప్పారు. గతంలో ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందని, ఈ విడత ప్రతీ నియోజకవర్గానికి మరో రెండు వేల ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంద మోహన్, చెంది తిరుపతి రెడ్డి, పి.రఘు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: వరి కోతల తర్వాత పొలానికి నిప్పు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!