KC VenuGopal Zoom Meeting Telangana leaders: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రచారం తీరు, అన్ని పార్టీల బలాబలాలపై వార్ రూమ్ నుంచి నేరుగా సమాచారం సేకరిస్తోంది. ఇందులోభాగంగా లోక్సభ ఎన్నికలకు కేవలం ఐదారు రోజులు ఉండడంతో తెలంగాణకు చెందిన ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించింది ఏఐసీసీ. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం జరుగుతున్న తీరుపై ముఖ్యనేతలను అప్రమత్తం చేశారు ఆ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్.
పార్టీ గెలుస్తుందన్న భావన ఏమాత్రం వద్దని కొందరు ఎమ్మెల్యేలను హెచ్చరించారాయన. ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో కీలక విషయాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో ఆయా నేతలకు పదవులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు కేసీ వేణుగోపాల్. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున ఎక్కువ సీట్లు గెలుపొందాలని సూచన చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు తమకు సంబంధం లేనట్టు ఉంటున్నారని, ఆ తరహా నిర్లక్ష్యం వద్దని సున్నితం గా హెచ్చరించారు కూడా.
అంతేకాదు తమ నియోజకవర్గాల్లో అధిక మెజార్జీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులపైనే ఉందన్నారు కేసీ వేణుగోపాల్. పోలింగ్ జరిగే వరకు ప్రజలతో మమేకం కావాలన్నారు. అప్పటివరకు నియోజకవర్గం దాటి నేతలు బయటకు వెళ్లవద్దన్నారు. కొందరు నేతలు ఈ మీటింగ్కు హాజరు కాకపోవడం పై ఆయన కాసింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత రుణమాఫీ అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనన్నారు కేసీ వేణుగోపాల్.
ALSO READ: ‘ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..?’
తెలంగాణలో దాదాపు 15 సీట్లపై కన్నేసింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకే నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దానిపై రిపోర్టు తెప్పించుకుంటోంది. నేతలు ఎక్కడెక్కడ వెనుకబడ్డారు? ఏ విధంగా వ్యవహరించాలి? ఏఏ అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే దానిపై ఎప్పటికప్పుడు గమనిస్తోంది. దాదాపు రెండువారాల కిందట హైదరాబాద్కు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అప్పుడూ నేతలతో భేటీ అయి పలు విషయాలను ప్రస్తావించిన విషయం తెల్సిందే.