CPI MLA Kunamneni SambaShiva Rao Comments: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ హడావుడీ నెలకొన్న విషయం తెలిసిందే. ఎక్కడా చూసినా కూడా సభలు, సమావేశాల వాతావరణం కనిపిస్తుంది. నేతల ప్రసంగాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ నియంత కంటే ప్రమాదకరి అని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారంటూ సాంబశివరావు పేర్కొన్నారు.
మోదీ ప్రధాని అయ్యాక జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు.. అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? బీజేపీకి అనుకూలంగా ఉన్న నాయకులను ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..? ఏపీ సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్ మీద ఎలా ఉండగలిగారు..? అంటూ ఆయన బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం మారుస్తామని.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ పలువురు బీజేపీ నాయకులు అంటున్నారని ఆయన అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అలా జరగదు.. జరగనివ్వబోమంటూ ఆయన పేర్కొన్నారు. నిరంకుశ మోదీని, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమేనంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు కేసీఆర్ విషయమై ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారన్నారు.
Also Read: ‘ఈ ఎన్నికలు తెలంగాణ – గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ లాంటివి’
నరేంద్ర మోదీ ఒక రాజులా పాలిస్తున్నారని, శ్రీలంక పరిస్థితులే దేశంలో కనిపిస్తున్నాయి.. నరేంద్ర మోదీని ప్రశ్నించకూడదా..? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీ మాటల గారడీతో జనాలను మోసం చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవల సాంబశివరావు పేర్కొన్న విషయం విధితమే. అదేవిధంగా సింగరేణి విషయమై కూడా ఆయన మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో సీపీఐ పార్టీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.