BRS Rajathotsavam: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి నేటితో 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది గులాబీ పార్టీ.రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఇక, 2022లో టీఆర్ఎస్ను కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి BRSగా మార్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ కారు పార్టీ ఆవిర్భవించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది.తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన.. బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నారు.
ఉద్యమ, అధికార, ప్రతిపక్ష పార్టీగా 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్..నేటి సభతో తన సత్తా చాటాలని చూస్తోంది. అందుగు తగ్గట్టుగా.. పార్టీ క్యాడర్ అంతా ఓరుగల్లు బాట పట్టింది. ఈ సభకు భారీ సమీకరణతో పాటు..పార్టీకి మళ్లీ ఊపు వచ్చేలా సభ జరగనుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగమే హైలెట్గా నిలవనుంది.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో నిర్వహించబోతున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించేందుకు సమాయత్తమైంది. ఇందు కోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని రెడీ చేశారు. మరో 154 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ స్టేజ్ను తయారు చేశారు.కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు.ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాలు వస్తాయని అంచనా వేశారు.అందుకు తగ్గట్టే వాహనాల పార్కింగ్ కోసం వెయ్యి 59 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.
అలాగే, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 10 లక్షల వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్స్లు, 12 వైద్య శిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక, పార్కింగ్ కోసం 2,000 మంది వాలంటీర్లు నిరంతరం విధులు నిర్వహించనున్నారు. అంతేకాదు.. విద్యుత్ సమస్య రాకుండా 250 జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇక, ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలి రానున్నారని పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. 3000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది. ఈ బస్సులే కాకుండా.. డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు ఇలా వేల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్లతో జనాలను వరంగల్ సభకు తరలించనున్నారు.
Also Read: దేశంలో ఆ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా మన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
చాలా రోజులుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పుడు ఆయన తొలిసారి బయటికొచ్చి మాట్లాడనుండటంతో కేసీఆర్ చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రజతోత్సవ సభా వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు లాంటి అంశాలపై ఆయన ఎలా రియాక్ట్ ఆవుతారోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా ఇదే వేదిక నుంచి కేసీఆర్ వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.