Bilawal Bhutto Indus River| సింధు నదిలో నీరు ప్రవహించకుంటే భారతీయుల రక్తం పారుతుందని పాకిస్తాన్ రాష్ట్రపతి కుమారుడు, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ భారత్ పై తీవ్ర పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందించిన భారత కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ అతడికి గట్టి కౌంటర్ ఇచ్చారు. “భుట్టో వ్యాఖ్యలు విన్నాను. ఒకసారి సింధు నదిలో దూకి చూస్తే.. నీళ్లు ఉన్నాయో లేదో తెలుస్తుంది,” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. భూట్టో మాటల్లో గౌరవం లేదని, ప్రజల ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని హర్ దీప్ సింగ్ హెచ్చరించారు.
అంతేకాకుండా, పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి.. పాక్ ప్రేరేపితమేనని హర్ దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఈ దాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సిందేనని, ఇంకా దీన్ని పెద్ద సమస్యగా మార్చుకోవడం వల్ల పాకిస్తాన్ కు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికే ఉద్దేశించబడ్డాయని, ఇది కేవలం ఆరంభమని చెప్పారు. ఉగ్రవాదంతో మానవ హక్కులను తుడిచివేయాలనుకునే ప్రయత్నాలను ప్రపంచం సమర్థించదని కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. పాకిస్తాన్ దేశం కేవలం చెత్త దేశం మాత్రమే కాదు, దాని స్థితి పూర్తిగా క్షీణించిపోయిందని తీవ్రంగా విమర్శించారు.
బిలావల్ భుట్టో ఏమన్నారు?
బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే, జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని నిర్ణయించడంతో పాకిస్తాన్ నేతలు భారత్పై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భిలావల్ భుట్టో ఒక సభలో ప్రసంగిస్తూ.. సింధు నదిలో నీరు పారకపోతే భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదేనని, ఆ నాగరికతకు తామే నిజమైన సంరక్షకులమని భారత్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: ఇండియా పాక్ ఉద్రిక్తత .. వివాహాలు రద్దు.. కుటుంబాలు విలవిల
అంతేకాక, పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తూ, సింధు నదిలో ప్రతి చుక్క నీరు తమదేనని ఆరోపించారు. భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. మరోవైపు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా సింధు నది జలాలు నిలిపివేయడంపై విరుచుకుపడుతూ ఒక వీడియో విడుదల చేశాడు. కశ్మీర్లో డ్యామ్లు నిర్మించడం ద్వారా భారత్, పాకిస్తాన్కు నీరు ఆపేస్తుందని, అది పాకిస్తాన్ను నాశనం చేయాలనే కుట్రగా వ్యాఖ్యానించాడు. భారత్ నీటిని ఆపితే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందని బెదిరింపులు చేశాడు.
1960లో భారత్, పాకిస్తాన్ దేశాలు సింధు జలాల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకొని, భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీనివల్ల పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయానికి అవసరమయ్యే నీటిలో 80 శాతం సింధు జలాలపై ఆధారపడి ఉంది. అలాగే ఆ దేశ జీడీపీలో 25 శాతం వాటా ఈ నదుల వల్లనే వస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పాకిస్తాన్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయనుందో స్పష్టంగా అర్థమవుతోంది.