Amberpet Students : బడిలో టీచర్లు మందలించారంటూ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన నలుగురు విద్యార్థుల్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 19 వ తేదిన పెద్ద అంబర్ పేట పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన విద్యార్థుల్ని యాదగిరి గుట్టలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోని బావి దగ్గర గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు హైదరాబాద్ నుంచి తప్పించుకుని వచ్చిన విద్యార్థులుగా గుర్తించారు. దాంతో.. యాదగిరి గుట్ట పోలీసుల సమాచారంలో అక్కడికి వెళ్లిన అంబర్ పేట పోలీసులు, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు. వారు చేసిన పని చాలా తీవ్రమైనదని, వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని పోలీసు అధికారులు వెల్లడించారు.
అంబర్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు బడిలో నిర్వహించిన పరీక్షల్లో కాపీ కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థుల్ని మందలించారు. వారి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసారు. దాంతో.. ఇంటికి వెళితే కొడతారని భయపడిన నలుగురు విద్యార్థులు… బడి అయి పోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎటో వెళ్లిపోయారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలను సంప్రదించగా, విద్యార్థులు బడి నుంచి వచ్చేశారని తెలిపారు. దాంతో.. తీవ్ర భయాందోళన పడిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బడి నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల్ని అంబర్ పేట, ప్రేమ నగర్ చెందిన ఎండీ అజమత్ అలీ (13), కొండ్ పేట తేజ్ నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్థన్(13)లుగా గుర్తించారు. బడి అయిపోయిన తర్వాత వీళ్లు ఎటు వెళ్లారో తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించగా.. కాచీగూడ రైల్వే స్టేషన్లో ఈ నలుగురు విద్యార్థుల పుటేజీ లభించింది. అక్కడి నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడి నుంచి ఎటు వెళ్లారో తెలియలేదు. దీంతో.. మిగతా మార్గాల్లో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.
రెండు రోజుల నుంచి వివిధ చోట్ల తిరిగిన చిన్నారులు, చివరికి యాదగిరి మండలం, దాతర్ పల్లిలోని ఓ వ్యవసాయ బావి దగ్గర స్నానాలు చేస్తుండగా స్థానికులు ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాచారం రాకపోవడంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్లూకోట్ పోలీసులు.. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాల కోసం ప్రశ్నించగా, విద్యార్థులంతా పాఠశాల నుంచి తప్పించుకుని వచ్చినట్లుగా గుర్తించారు. దాంతో.. వెంటనే అంబర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. వారు తప్పిపోయిన పిల్లలే అని నిర్ధరించుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి నలుగురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని, తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
Also Read :Hydra Bathukama kunta: బతుకుతున్న బతుకమ్మ కుంట..హైడ్రా సక్సెస్
పిల్లలు చిన్నవయసులో తెలిసీ తెలియన చేశారని, కాపీ కొట్టిన సంగతి ఇంట్లో తెలియడంతో కొడతారనే భయంతోనే పారిపోయారని పోలీసులు వెల్లడించారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, ఇలాంటి తప్పుడు పనులు మరోసారి చేయొద్దని చెప్పినట్లుగా మీడియాకు వెల్లడించారు. కాగా.. విద్యార్థులు తిరిగి ఇంటికి చేరడంతో, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భయంలో వాళ్లు ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదని, ఏమైనా సురక్షితంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. రెండు రోజుల్లోనే పిల్లల ఆచూకీని గుర్తించిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.