Hydra Bathukama kunta: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు కుంటల సంరక్షణ పునరుద్ధరణలో.. హైడ్రా మరో విజయం సాధించింది. బఫర్ జోన్లలో నాళాలపైన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు చెరువులను పునరుద్ధరించే పనులు నిర్వహిస్తున్న హైడ్రా.. అంబర్ పేట్ బతుకమ్మ కుంటలో తవ్వకాలు చేపట్టింది. మోకాల లోతు తవ్వగానే బతుకమ్మ కుంటలో నీళ్లు వచ్చాయి. దీంతో బతుకమ్మకుంట బ్రతికే ఉందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా పుణ్యమా అంటూ అంబర్ పేట్లోని బతుకమ్మకుంట బయటపడింది. కబ్జా చెర వీడడంతో దీని అభివృద్ధి పైన హైడ్రా దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా కుంటపైనే దృష్టిపెట్టింది. ఆ తర్వాత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు తాజాగా చెరువులో పూడిక తీయడం స్టార్ట్ చేశారు. బుధవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా లోపల నుంచి వాటర్ ఉబికి వచ్చాయి. ఈ దృశ్యాన్ని చూస్తున్న స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ.. కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.
బడాబాబుల కబ్జాలకు గురై కుంట ఎండిపోయి జీవం పోయిందనుకున్న బతుకమ్మ కుంట బ్రతికే ఉందని తెలిసి స్థానికులు చేరుకుంటున్నారు. ఆ కుంటలో మోకాళ్ల లోతు మట్టి తీయగానే బిరబిర గంగమ్మ బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల కొందరు ఇది బతుకమ్మకుంట కాదు.. మా స్థలమని నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారు అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కాగా హైదరాబాద్ను మహా నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా చర్యలు చేపడుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేసేందుకు కృషి చేస్తున్నారు. దాని కోసం జీహెచ్ఎంసీ హెచ్-సిటీ ప్రాజెక్టు పేరులో ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, అండర్పాస్ల నిర్మాణాలకు రూ.5,942 కోట్ల విలువైన 38 పనులకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఇక ఫోర్త్ సిటీ లక్ష్యం, నగరం నలుమూలలా మెట్రో విస్తరణ, అంతర్జాతీయ సంస్థలకు హైదరబాద్ ఫస్ట్ ఛాయిస్గా ఎదుగుతుండడంతో కొత్త టెక్నాలజీ రంగాలకు హబ్గా హైదరాబాద్ను నిలిపేందుకు, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.
Also Read: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. అలాగైతే రద్దు చేస్తాం..
రాబోయే రోజుల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆధునిక సదుపాయాల వృద్ధికి.. ప్రభుత్వం నడుంబిగించడమే కాకుండా నగరాన్ని సస్టైనబుల్ సిటీగా తీర్చిదిద్దడమే హైడ్రా లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంది. ఇందులో భాగంగా బతుకమ్మ కుంటలో కొన్ని అడుగుల తవ్వకాలకే నీళ్లు ఉబికిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హైడ్రా చర్యల వల్లే బతుకమ్మకుంటకు పునరుజ్జీవం దక్కిందని కాంగ్రెస్ నేతలు కుంట వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే ఔటర్ రింగ్ రోడ్డు వరకు తన పరిధిని పెంచుకొని చెరువులు, కుంటలు, నాళాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చేపట్టింది. కాగా అతి త్వరలోనే హైడ్రా మొదటి పోలీసు స్టేషన్ కూడా ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో రాబోయే హైడ్రా చర్యలపై ఆసక్తి నెలకొంది.