NSN Infotech: మాదాపూర్లో ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే ఒక ఐటీ కంపెనీ నిరుద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. కంపెనీ అకస్మాత్తుగా బోర్డు తిప్పేయటంతో పాటు.. దాని యజమాని స్వామి నాయుడు పరారవడం ఘరానా మోసంగా బయటపడింది. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని.. శిక్షణ ఇస్తామని నమ్మించి, దాదాపు 400 మంది నిరుద్యోగ యువతీయువకుల దగ్గర ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసింది.
NSN ఇన్ఫోటెక్ కంపెనీ నిర్వహకులు తమ మాటలతో సుమారు 400 మందిని నమ్మించారు. మంచి ఉద్యోగం, శిక్షణ లభిస్తుందని ఆశ చూపారు. ఈ పేరుతోనే ఒక్కొక్క వ్యక్తి నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. మొత్తం వసూళ్ల విలువ కోట్లలో ఉంటుందని అంచనా. కష్టపడి సంపాదించిన డబ్బులు, అప్పులు చేసి మరీ ఈ శిక్షణ, ఉద్యోగం కోసం చెల్లించిన బాధితులు, కంపెనీ మోసాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
డబ్బులు చెల్లించిన తర్వాత కూడా.. వారికి ఉద్యోగం రాక, శిక్షణ సరిగా అందక పోవడంతో అనుమానం పెరిగింది. ఈ క్రమంలో కంపెనీని సందర్శించిన బాధితులకు కార్యాలయం మూసి ఉన్న విషయం తెలిసింది. సంస్థ యజమాని స్వామి నాయుడు అప్పటికే కనిపించకుండా పోయాడు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో.. మోసపోయినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో బాధితులు వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సమిష్టిగా ఫిర్యాదు చేశారు.
ఈ మోసం కేవలం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాక.. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం పరిధిలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. శిక్షణ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన NSN ఇన్ఫోటెక్.. దాని యజమాని పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. దాదాపు 400 మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ ఆర్థిక మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న స్వామి నాయుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఐటీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాలపై నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మోసం ఘటనతో హైదరాబాద్ ఐటీ రంగంలో మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. స్వామి నాయుడును త్వరలో పట్టుకుని.. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Constitution Day: తెలుగుతో సహా 9 భాషల్లో రాజ్యాంగం.. డిజిటల్ కాపీ రిలీజ్ చేసిన రాష్ట్రపతి