Minister Sitakka: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. మహిళా సంఘాల సభ్యులు, ఆడపడుచులు స్వయంగా ఎంపిక చేసుకున్న డిజైన్లు, రంగులతోనే ఈ చీరలు అందిస్తున్నామన్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కావాలనే విస్మరిస్తున్నారని ఆమె విమర్శించారు.
ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతుంటే.. ఆ ఆనందం కూడా బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదని సీతక్క విమర్శించారు. మహిళలు సంతోషంగా ఉంటే.. వాళ్ల కళ్లల్లో నిప్పులు పోసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం బీఆర్ఎస్ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఈ అంశంపై దురుద్దేశ్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇవి బీఆర్ఎస్ పాలనలో జరిగినట్టుగా సూరత్, దుబాయ్ నుంచి కేజీల లెక్కన తెచ్చిన చీరలు కాదని.. సిరిసిల్ల ప్రాంతంలోని నేతన్నలు తమ చేతులతో స్వయంగా నేసిన చీరలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత నిజంగానే నిజం తెలుసుకోవాలంటే సిరిసిల్లకు వెళ్లి అక్కడి నేతన్నలను అడగాలని ఆమె సవాల్ విసిరారు. చీరలు బాగాలేవంటూ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానపర్చడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
చీరలు కొందరికే ఇస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే.. అవసరమైన వారికి సంఘాలలో చేర్చుతూ సారె పెట్టి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గతంలో 60 సంవత్సరాలు పైబడిన మహిళలను సంఘాల నుంచి తొలగించే నిబంధన ఉండేదని, ఆ నిబంధనను ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందన్నారు. లక్ష్యంగా కోటి మంది మహిళలను సంఘాలలో చేర్చి, వారికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
ప్రభుత్వం మహిళల కోసం ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ వాళ్లు ఓర్వలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు. ఫ్రీ బస్సు ప్రవేశపెడితే బ్రేక్ డ్యాన్స్లు చేసుకుంటున్నారని, కొట్టుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు చీరల పంపిణీపై కూడా ఎన్నికల కోసమేనని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే రూ.65 లక్షల చీరలకు ఏడాది క్రితమే ఆర్డర్ ఇచ్చిందని, అందరికీ అందించాలనే ఉద్దేశంతో మరో 35 లక్షల చీరలకు కూడా ఆర్డర్ ఇచ్చామని వెల్లడించారు. మహిళల వివరాలను యాప్లో నమోదు చేసి వారికి భీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి ఇప్పటికే 1300 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వం చెల్లించిందని, భవిష్యత్తులో కూడా ఈ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శిల్పారామంలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా బజార్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
Also Read: ప్రజా పోరాటాలతో మీకు బుద్ధి చెప్తాం.. సర్కారుపై కవిత ఆగ్రహం
వాస్తవంగా చీరల్లో లోపాలు ఉంటే ఆధారాలతో సూచనలు చేయాలని, కానీ కావాలనే అబద్ధపు ప్రచారం చేస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. మహిళలను అవమానపరిచే రాజకీయాలకు సమాధానం తప్పక ఇస్తామని స్పష్టం చేశారు. మహిళల గౌరవం, వారి సంతోషమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని సీతక్క స్పష్టంగా చెప్పారు.