Hyderabad: తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుందా? తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 63 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా? దీని ప్రభావం ఏయే పార్టీలపై పడబోతోంది? చాలామంది ఓటర్లు సొంతూరులో ఓటు హక్కుకు ప్రాధాన్యత ఇచ్చారా? గ్రేటర్లో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశముందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ-SIR సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న తాజా సమాచారం మేరకు దాదాపు 63.5 లక్షల ఓట్లు తొలగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గైర్హాజరు, ఒక చోట నుంచి మరోచోటికి మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లు ఇలా అన్ని కేటగిరీల కింద తొలగింపుకు రంగం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశమున్నట్లు అధికారుల అంచనా. శనివారం వరకు రాజధాని మూడు జిల్లాల పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు మూడో వంతు ఓట్లు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సెలవులు ఉన్నప్పటికీ ఆది-సోమవారాల్లో బూత్ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లో ఉన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఓట్ల తొలగింపు గ్రేటర్లో అన్ని నియోజకవర్గాల్లో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.
సనత్నగర్ నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 1.16 లక్షల ఓట్లు రద్దయ్యే అవకాశం ఉన్నాయి. దాదాపు 45.68 శాతం అన్నమాట. జూబ్లీహిల్స్- 44 శాతం, ఎల్బీనగర్-42 శాతం, ఉప్పల్-40 శాతం, మహేశ్వరం- 40 శాతం ఓట్లు జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు అధికారుల మాట. ఆది-సోమవారాల్లో ఈ సంఖ్యల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ALSO READ: బోనాల పండగ ఎలా ప్రారంభమైంది? ఆషాడ బోనాల వెనుక ఆసక్తికరమైన విషయాలు
తెలంగాణలో డిజిటలీకరణ 78 శాతం కాగా, శనివారం నాటికి హైదరాబాద్లో 58.41 శాతంగా ఉంది. ఆగస్టు 10 చివరి తేదీగా కాగా, రెండో శనివారం, ఆదివారం, సోమవారం బోనాలు పండుగ సెలవుల వల్ల, బూత్ స్థాయి అధికారులు శుక్రవారం నాటికి చాలావరకు పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించారు. పనిలో ఉన్న BLOలు ప్రజలు తమ గణన పత్రాలను సమర్పించడం కోసం వేచి ఉండలేదు. అలాంటి వారిని ASDD కేటగిరీలో గుర్తిస్తున్నారు. సోమవారం గడువు ముగిసిన తర్వాత ఎంతమంది ఓటర్లు అనేది తేలనుంది. ఆగస్టు 17న వెలువడనున్న ముసాయిదా జాబితాపై అన్ని పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.