Betting Apps Case : మేటర్ మాంచి రంజు మీదుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు కాక రేపుతున్నాయి. సెలబ్రిటీలు బెంబేలెత్తి పోతున్నారు. పోలీస్ కేసులతో పరేషాన్ అవుతున్నారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, అనన్య, మంచు లక్ష్మీ లాంటి ప్రముఖల నుంచి.. శ్రీముఖి, విష్ణుప్రియ, సన్నీ యాదవ్, సాయి, శ్యామల వరకు.. అనేక మందిపై FIR రిజిస్టర్ కావడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు 24 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. హవాలా, మనీలాండరింగ్ జరిగిందనే అనుమానం ఉండటంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది.
యాంకర్ విష్ణుప్రియ లాయర్ తో పాటు వచ్చి.. పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి అడిగారు. ఇదే కేసులో హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్లు దుబాయ్ పారిపోయినట్లు డౌట్. వీరిద్దరు ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్పై నిఘా పెట్టారు. ఇప్పటికైతే హడావుడి బానే చేస్తున్నారు కానీ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వీళ్లందరినీ అరెస్ట్ చేస్తారా? కఠిన శిక్షలు విధిస్తారా? కేసులు పెట్టి వదిలేస్తారా? ఎంక్వైరీతో డైలీ సీరియస్ నడిపిస్తారా? ఇలా రకరకాల చర్చ.. రచ్చ నడుస్తోంది.
వందలాది కేసులు.. బెట్టింగ్ యాప్స్కు చెక్
ఆన్లైన్ బెట్టింగ్ ఇల్లీగల్ అని.. తెలంగాణలో బెటింగ్ యాప్స్ పై 2017 నుంచి బ్యాన్ ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో DG శికా గోయల్ బిగ్ టీవీతో చెప్పారు. ఇప్పటి వరకు 108 బెట్టింగ్ యాప్స్ ను ఆన్లైన్ నుంచి డిలీట్ చేశామని.. 800 వరకు కేసులు నమోదయ్యాయని తెలిపారు. దేశంలో 8 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉందని.. ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరూ నమ్మోద్దని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ పై నిఘా ఉంచుతున్నామని డీజీ శికా గోయల్ హెచ్చరించారు.
మెట్రోలో బెట్టింగ్ ప్రమోషన్.. కేసు పెట్టేనా?
కట్ చేస్తే.. లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ట్రోల్ అవుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఓ బెట్టింగ్ యాప్ యాడ్స్ విస్తృతంగా ఉన్నాయి. మెట్రోలో ఫుల్ ప్రమోషన్ చేస్తున్నారు. లోపలా, బయటా.. రైల్ మెుత్తం ఆ బెట్టింగ్ యాప్ స్టిక్కర్లే. మరి, వీటిని చూసి పబ్లిక్ టెంప్ట్ అవరా? మెట్రోలోనే యాడ్స్ ఇస్తే.. ఇది చట్టబద్దమే అనుకొని డబ్బులు పెట్టి దివాళా తీయరా? ఓ వైపు ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేరమని చెబుతోంది. ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెడుతోంది. అలాంటప్పుడు.. PPP మోడల్లో పని చేస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ యాడ్ ఎలా ఇస్తారు? ఎలా ప్రమోట్ చేస్తారు? ఇది క్రైమ్ అని అధికారులకు తెలీదా? లేదా, ఆఫీసర్లు భారీగా ముడుపులు తీసుకున్నారా? డబ్బులిస్తే ఏ యాడ్ వేయమన్నా వేసేస్తారా? సామాన్యులకు ఓ రూల్.. మెట్రోకు మరో రూలా? ఇలా సోషల్ మీడియాలో హైదరాబాద్ మెట్రో అధికారులను కామెంట్స్తో చీల్చి చెండాడుతున్నారు నెటిజన్లు. మెట్రో సంస్థపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, హైదరాబాద్ మెట్రోపై కేసు పెడతారా? మెట్రో పెద్దలను పోలీస్ స్టేషన్కు రప్పిస్తారా? లెట్స్ సీ…