Bandi Sanjay:స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మీడియా కవరేజీ కోసం రెండు పార్టీలు పడుతున్న తంటాలను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు ఎలిమినేషన్ చేయబోతున్నారన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ..
కరీంనగర్ లోని 37వ డివిజన్ లో రూ.77 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు బండి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరగడంతోపాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి జరగబోతోందన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే కేంద్రానికి మంచి పేరుస్తుందని అక్కసుతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమమన్నారు. ఈ స్కీం అమలు రాష్ట్రానికి భారం అనిపిస్తే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలే తప్ప కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లకు బ్రేక్ ఫాస్ట్, పాలు, లంచ్ సౌకర్యం కల్పించడాన్ని కేంద్ర మంత్రి స్వాగతించారు. ఒకవైపు బ్రేక్ పాస్ట్ సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలో ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగడమే కారణమని బండి అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని, చాపకింద నీరుగా బలపడుతుండటంతో ఓర్వలేకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై బిగ్ బాస్ షోను తలపించేలా డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలేనని, అందుకే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
పొన్నం పై బండి సంజయ్ విమర్శలు
అందుకే తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను ఎలిమినేషన్ చేసి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని బండి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కూడా సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారని, భార్యాభర్తల ఫోన్లను కూడా వింటూ నీచానికి పాల్పడుతున్నారని అంటున్నారని, అయినా బాధ్యులపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని బండి ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్ధులను వేధించడానికి వాళ్ల ఫోన్ నంబర్లను కూడా ట్యాపింగ్ చేయించారని, అయినా ఈ కేసు విచారణను ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంజయ్ డిమాండ్
బాధ్యులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని, ఫోన్ ట్యాపింగ్ కేసు జాప్యం వెనుక కారణాలేమిటని అనుమానం వ్యక్తంచేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై తక్షణమే విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసినా ఇంతవరకు ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము లేకుంటే, రాష్ట్రానికి చేతగాకపోతే కేంద్రాన్ని కోరితే విచారణ జరిపి దోషుల సంగతి చూసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్ స్పష్టం చేశారు.