Bandi Sanjay: డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలు పట్టవా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యిందని, ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రివర్గంలో డూప్లికేట్ గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ.వెయ్యి కోట్ల నిధుల సేకరణపైనే చర్చ జరుపుతున్నారా? అని నిలదీశారు. అవ్వాతాతలకు ప్రతినెలా రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వడంపై కేబినెట్ లో ఎన్నడైనా చర్చించారా? అని ప్రశ్నించారు. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ ఫిట్స్ ను చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా చలనం లేదా? అని ఫైరయ్యారు.
డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై ఎన్నడైనా చర్చించారా? అని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై కేబినెట్ లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో సగం పూర్తయినా ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయనందుకు సిగ్గనిపించడంలేదా? అని విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీలను ఏ రోజు నుంచి అమలు చేస్తారని, వాటికి ఎంత ఖర్చవుతుందో కేబినెట్ లో చర్చించి అమలు తేదీ ప్రకటించాలని బండి డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Also Read: Udaya Bhanu: ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరింది.. సమాజానికి ఇది అవసరం!
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మంగళవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తారు. వారికి కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి పార్టీ కార్యాలయంలో అల్పాహార విందు ఇవ్వనున్నారు. అనంతరం ఆయా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఉదయం 11 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు లాల్ దర్వాజ మహంకాళి టెంపుల్ కు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు లాల్ దర్వాజలోని రాజన్న బౌలి రెడ్డి జన సంఘం ఫంక్షన్ హాలులో ఆయా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీజేపీ స్థానిక నాయకులతో కలిసి భోజనం చేస్తారు.
Also Read: Air Ambulance Crash: జార్ఖండ్లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్, వారంతా మృతి