Banjara Hills: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బంజారాహిల్స్లో భారీ దొంగతనం కలకలం రేపింది. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో, ఒక ప్రైవేట్ సంస్థ కార్యాలయంలోకి చొరబడిన దుండగులు సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ‘గురుకృప ఎక్స్పోర్ట్స్’ అనే ప్రైవేట్ సంస్థ కార్యాలయం ఉంది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారికి చెందిన సంస్థ ఇది. ఈ ఆఫీసులో వజ్రాలను పొదిగే పనుల కోసం దాదాపు ఒక కిలో బరువున్న విలువైన బంగారు ఆభరణాలను తీసుకొచ్చి, ప్రత్యేకంగా ఒక లాకర్లో భద్రపరిచారు. అయితే, శని, ఆదివారాల్లో ఆఫీస్ మూసి ఉన్న సమయాన్ని చూసి దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.
వాష్ రూమ్ కిటికీ ద్వారా ఎంట్రీ
కార్యాలయంలోకి దొంగలు చొరబడిన తీరు చూస్తుంటే పక్కా ప్లాన్తోనే ఈ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆఫీస్ వెనుక వైపు ఉన్న వాష్ రూమ్ కిటికీని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. దాని గుండా లోపలికి ప్రవేశించి, నేరుగా నగలు దాచిన లాకర్ను లక్ష్యంగా చేసుకున్నారు. లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న 7 ఖరీదైన బంగారు నెక్లెస్లు, వాటికి మ్యాచింగ్గా ఉన్న 7 జతల చెవిపోగులను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు.
పోలీసుల రంగప్రవేశం..
ఆఫీస్ తెరిచి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించిన సూరత్ వ్యాపారి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. నిందితుల వేలిముద్రలను సేకరించారు. ప్రస్తుతం పోలీసులు బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని, అలాగే ఆఫీస్ లోపల, బయట ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను జల్లెడ పడుతున్నారు. ఈ చోరీ వెనుక ఆఫీస్ సమాచారం తెలిసిన పాత నేరస్థుల హస్తం ఉందా లేక లోపలి వ్యక్తులెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!