Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజా పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వీటిపై మనసులోని మాట బయట పెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
మీడియాతో చిట్ చాట్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. ఏ ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం మంది సంతోషంగా ఉంటారని తాను కోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజమన్నారు.
గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదన్నారు. టీఆర్ఎస్ తరఫున తెలంగాణ తల్లి ఉండేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో 64 వేల కోట్ల అసలు- వడ్డీలు కడుతున్నామన్నారు. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి 6,400 కోట్లు ఉంటే.. ఇప్పుడు ఏడాదికి 64 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడినట్టు చెప్పుకొచ్చారు.
ALSO READ : కాకినాడ పోర్టుకు పీడీఎస్ రైస్.. తెలంగాణ నేతల మెడకు ఉచ్చు
పదేళ్ల తరువాత హాస్టల్స్కి ఇచ్చే డైట్ చార్జీలు పెంచామన్నారు డిప్యూటీ సీఎం. డిసెంబర్ 14 నుంచి తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారన్నారు. హైడ్రాకి ధనిక-పేద అన్న తేడా లేదన్నారు. చెరువులు ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చే బోనస్, రైతు భరోసా కంటే.. రుణమాఫీ ఎక్కువ లబ్ధి చేకూర్చిందన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తాను కలవలేదని, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.