Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత నాలుగు, ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది. ఉత్తర తెలంగాణ అంతటా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్ లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్నా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూ, తిరుపతి జిల్లాల్లో రేపు మోస్తారు నుంచి తేలకపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
ALSO READ: Scholarship: ఇంటర్ పాసయ్యారా..? అయితే రూ.20,000 ఇలా సులభంగా పొందండి..
అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.