Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో బీజేపీ ఇందిరాపార్క్ వద్ద సోమవారం నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ ఇందిరాపార్క్ హైదరాబాద్ వద్ద ఈ నిరాహార దీక్షను చేపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు, నాయకులు ఈ దీక్షలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపార వేసుకుని తిరుగుతున్నారని, పేద ప్రజల ఇండ్లను కూలగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. ప్రజలపై అమానుష వైఖరిగా ఆయన పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని 147, 148, 149 సర్వే నంబర్ల భూదాన్ భూముల్లో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు 2013-14 నుంచి, సుమారు 100 గజాల చొప్పున భూమి తీసుకుని దాదాపు 600 పేద కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. ఈ కుటుంబాలు కూలీ పనులు, హమాలీ పనులు చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని, కొందరు బంగారం అమ్ముకుని తమ సొంత సంపాదనతో ఇక్కడ ఇళ్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారన్నారు.
Also Read: KTR: ఒక్క కొత్త ఇల్లు కట్టినట్లు నిరూపించినా.. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కేటీఆర్ సవాల్
గతంలో ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో అనేక సార్లు స్టేటస్ కో ఆదేశాలు జారీ అయ్యాయని, ఎవిక్షన్ చేయొద్దని, జోక్యం చేసుకోవద్దని కోర్టు స్పష్టంగా చెప్పినా కూడా నోటీసులు ఇవ్వడంపై రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే భూదాన్ బోర్డు, రెవెన్యూ శాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ ఆ పేరుతో ఇక్కడ పేద ప్రజలపై దాడి చేసి, వారిని వేధించి, వారు కట్టుకున్న కలలను కూల్చివేసి రోడ్డున పడేయడం ఏం మానవత్వమని రాంచందర్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా వ్యవహరించే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీశారు. బీజేపీ నాయకులు అక్కడే అన్నదానం కార్యక్రమం నిర్వహించి, రోడ్డున పడిన కుటుంబాలకు తక్షణ భరోసా కల్పించారన్నారు. పేదల పక్షాన నిలబడటం తయ కర్తవ్యమని తెలిపారు.
రేవంత్ రెడ్డి గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసం పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం పూర్తిగా సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుని ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లయినా కట్టించి గూడు కల్పించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ 2023లో ఇక్కడి కుటుంబాలను నిర్వాసితులను చేయాలని ప్రయత్నాలు జరిగాయన్నారు. కానీ పేదలకు గూడు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, పేదలకు గూడు, విద్య, కూడు కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాంచందర్ రావు తెలిపారు. హైకోర్టు స్టే ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంత దారుణంగా కూల్చివేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టరేట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిందని, హైవే ప్రాజెక్టు కూడా రానున్న నేపథ్యంలో ఈ విలువైన భూముల్లో పేదలు ఉండకూడదనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడే పేద ప్రజలకు శాశ్వత నివాస గృహాలు కట్టించి ఇవ్వాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
Also Read: Naralokesh : మాటలు కాదు.. చేతల్లో చూపిస్తాం.. వైసీపీకి ఇచ్చేపడేసిన లోకేశ్!