Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. కొత్త పార్టీలు అందరూ పెడతారని, కానీ ప్రజాదరణ ఏ పార్టీకి ఉంటుందన్నదే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, అందరి చూపు తమ పార్టీ వైపే ఉందన్నారు. ఎందుకంటే దేశంలో అవినీతి రహిత పాలనను మోడీ సర్కార్ అందిస్తోందన్నారు.
నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని చెప్పుకొచ్చారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తుచేశారు. గతంలో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందని, అలాంటిది.. పుట్టబోయే బిడ్డకు టీఆర్ఎస్ అని పేరు పెట్టారని ఎద్దేవాచేశారు.
Also Read: గుంటనక్కలతో దందాలు చేసింది మీరే కదా.. కవిత పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేర్లు మారినా పాలన మారలేదని, రాష్ట్ర సంపదను దోచుకున్న వారే ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారని ఫైరయ్యారు. దోచుకున్న, దాచుకున్న సొమ్మును ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తామని చెబుతున్నారని, వాటిని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజా క్షేత్రంలోనికి వెళ్లి ప్రజా పోరాటాలు చేస్తోందని, అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రావడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రశిక్షణ తరగతులకు పార్టీ సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హాజరయ్యారు.
Also Read: గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!