Huzurabad BJP News: స్వేఛ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీలో ఒక వినూత్న ఘట్టం చోటుచేసుకుంది. సాధారణంగా పార్టీ కార్యాలయాల్లో జరిగే బి-ఫామ్ల పంపిణీ కార్యక్రమం, ఈసారి భక్తిభావం మరియు రాజకీయ నిబద్ధత కలగలిసి ఆధ్యాత్మిక వేదికపై జరిగింది. పట్టణంలోని ప్రసిద్ధ రంగనాయకుల గుట్ట వద్ద వెలిసిన పాటిమీది ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా బీజేపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విజయం చేకూరాలని, పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ అర్చనలు చేశారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం బి-ఫామ్ ల పంపిణీ ప్రక్రియ మొదలైంది.
Also Read: Prabhas: లవ్ స్టోరీపై తొలిసారి స్పందించిన ప్రభాస్.. ఎక్స్పెక్ట్ చేయలేదు!
ఈ కార్యక్రమం కేవలం బి-ఫామ్ ల పంపిణీకే పరిమితం కాకుండా, అభ్యర్థుల నైతిక నిబద్ధతను చాటిచెప్పే వేదికగా మారింది. బి-ఫామ్ లు అందుకునే ముందు ప్రతి అభ్యర్థి “మేము గెలిచినా, ఓడినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారము” అని ఆంజనేయస్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల సంస్కృతి పెరిగిపోతున్న తరుణంలో, అభ్యర్థుల నుంచి ఇలా ప్రమాణ పూర్వక హామీ తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన తర్వాతే అభ్యర్థులకు బి-ఫామ్ లు అందజేయడంతో కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది. పార్టీ పట్ల విధేయతగా ఉండే వారికే ప్రాధాన్యత ఉంటుందని నాయకత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Prabhas: లవ్ స్టోరీపై తొలిసారి స్పందించిన ప్రభాస్.. ఎక్స్పెక్ట్ చేయలేదు!