Modi Visit: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయితే పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు, ఇతర సమస్యలతో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు సైతం విపరీతంగా వేధిస్తుండటంతో రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పి మరింత ఎక్కువవుతోంది. ఈ తరుణంలో ఈనెలలో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని తెలియడంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు సమస్యల పరిష్కారానకి చెక్ పడుతుందని పలువురు భావించారు. కానీ ప్రధాని పర్యటన ఇప్పట్లో లేదని తెలియడంతో శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మున్సిపల్ నిధుల పంచాయితీలతో సతమతమవుతున్న కమలనాథులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడటంతో కార్యకర్తలు డీలాపడ్డారు.
చాలా కాలంగా ప్రధాని మోడీ పర్యటన కోసం తెలంగాణ బీజేపీ నేతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మోడీ రాక ఎంతో అవసరమని భావించారు. అయితే, ప్రస్తుతానికి ఆ పర్యటన లేనట్టేనని సంకేతాలు రావడంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. పెద్దాయన వస్తేనైనా పార్టీలో గందరగోళం తగ్గుతుందని ఆశించిన శ్రేణులకు మళ్లీ నిరీక్షణ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కు చేరింది. గ్రూపు రాజకీయాలు మరింత రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల ఒకరిపై ఒకరు అధిష్టానానికి రాసిన లేఖాస్త్రాలు పార్టీ ప్రతిష్టను బజారున పడేశాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ స్థాయిలో గందరగోళం కొనసాగడం హైకమాండ్కు కూడా తలనొప్పిగా మారింది.
Also Read: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ జెండాకు కలర్ ఫిక్స్!
మోడీ.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని అనుకున్నా.. వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలని ప్రధాని భావించినా.. అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. దానికి ప్రధాన కారణం చేతిలో బలమైన అభివృద్ధి అస్త్రం లేకపోవడమేనని చెప్పుకుంటున్నారు. పదేళ్లు గడుస్తున్నా బీబీనగర్ ఎయిమ్స్ పనులు అసంపూర్తిగానే ఉండటం, అటు ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాకపోవడం, వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ లొల్లి అడ్డంకిగా మారడం వంటి అంశాలతో టూర్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉత్త చేతులతో వచ్చి శంకుస్థాపనలు చేయడం కంటే.. పనులు పూర్తయ్యాకే రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం రాజకీయాలే కాకుండా, మున్సిపల్ ఎన్నికల నిధుల పంపకాల విషయంలో జరుగుతున్న రచ్చ పార్టీని మరింత ఇరకాటంలో పడేసింది. నిధుల వినియోగంపై పారదర్శకత లేదని కొందరు, తమకు ప్రాధాన్యత దక్కడం లేదని మరికొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ ఆర్థిక లావాదేవీల పంచాయితీలు కాస్తా ఇప్పుడు గ్రూపుల మధ్య వార్కు దారితీశాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన సమయంలో.. ఈ అంతర్గత విభేదాలు పార్టీని వెనక్కి లాగుతున్నాయి. మోడీ పర్యటన ద్వారా ఈ సమస్యలన్నింటికీ చెక్ పడుతుందని, కేడర్లో కొత్త జోష్ వస్తుందని ఆశించిన నేతలకు ఇప్పుడు బ్రేక్ పడటం పెద్ద దెబ్బగా మారింది. మరి ఈ గందరగోళానికి పుల్స్టాప్ పడి, పార్టీ ఎప్పుడు గాడిలో పడుతుందో వేచి చూడాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం ఖానాపూర్ కు వెళ్లనున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ పీఠాన్ని పీఠాన్ని కాంగ్రెస్ కు దక్కకుండా చేసిన విషయం తెలిసిందే.
Also Read: ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిగ్ స్కామ్.. షాక్లో ఉన్నతాధికారులు