Bandi Sanjay: స్వేఛ్చ బ్యూరో: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 66 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం విడుదల చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల జాబితాను విశ్లేషిస్తే 80 శాతం మంది కార్యకర్తలకే టిక్కెట్లు దక్కాయని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయిందన్నారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే ఈసారి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. గెలిచే అవకాశం లేని డివిజన్లలో మాత్రమే ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ కార్పొరేటర్లకు, ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులకు టిక్కెట్లను కేటాయించినట్లు చెప్పారు.
టిక్కెట్ల కేటాయింపులో తాను జోక్యం చేసుకోలేదన్నారు. కరీంనగర్ జిల్లాకు త్రిసభ్య కమిటీని నియమించి ఎవరికి టిక్కెట్లు కేటాయించాలనే అంశంపై డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించి, వివిధ సర్వే ఏజన్సీల ద్వారా వచ్చిన నివేదికలతోపాటు కార్యకర్తల పనితీరును పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. వాటిని కూడా వారం రోజులుగా డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను చూసిన త్రిసభ్య కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పంపిందని, ఆ జాబితాను పరిశీలించిన రాంచందర్ రావు అధికారికంగా విడుదల చేసినట్లు చెప్పారు ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలో కిసాన్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బండి సంజయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని విమర్శించారు. 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇవ్వలేదన్నారు.
Also Read: Suicide Attempt: పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం
బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లేనని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారని పేర్కొన్నారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని బండి పేర్కొన్నారు. కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని, తాను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారని విరుచుకుపడ్డారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత తనదని భరోసానిచ్చారు. గంగుల.. మూట, ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపోవాలని మండిపడ్డారు.
అయారాం గయారాం సంస్కృతితో రాజకీయాలు కంపుకొడుతున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో వినూత్న రీతిలో ప్రతిజ్ఞ చేయించారు. గెలిచిన తరువాత పార్టీని వీడనని, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని, కరీంనగర్ అభివృద్ధితోపాటు దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. అభ్యర్థులు ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
Also Read: Chamala Kiran Kumar: ఆయనకు కడుపుమంట ఉంటే నేనేం చేయాలి? ENO ప్యాకెట్ ఇవ్వడం తప్ప.. చామల ఘాటు సెటైర్లు