GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. నగరంలోని మూడు కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలోని కీలక నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై నజర్ పెట్టాలని ఆయన నాయకులకు సూచించారు.
ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పునర్వ్యవస్థీకరించి 300 కొత్త డివిజన్లుగా విభజించిన నేపథ్యంలో, పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రతి కొత్త డివిజన్కు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాంచందర్ రావు నేతలను ఆదేశించారు. వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక చర్చల అంనతరం కేడర్ కు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మల్కాజిగిరి, సైబరాబాద్, జీహెచ్ఎంసీ కార్పొరేషన్లలో గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అంతా కలిసి పనిచేయాలని రాంచందర్ రావు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల మార్చి 23న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మూడు కార్పొరేషన్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాగ్రహాన్ని చాటిచెప్పేలా ఈ నిరసన ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని రాంచందర్ రావు విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా పాతబస్తీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభయ్ పాటిల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Also Read: Tamanaih Bhatia : చూపులతోనే చంపేస్తున్న మిల్క్ బ్యూటీ.. రెండు కళ్లు చాలట్లేదు..