Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన దూకుడును పెంచింది. ఈ నెల 10న హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రధాని మోడీ భారీ బహిరంగ సభను పార్టీ ఒక చారిత్రాత్మక ఘట్టంగా మలచాలని భావిస్తోంది. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రధాని సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలనే టాస్క్ ను వారికి అప్పగించింది. అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు సవాల్ గా మారింది. వారి సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాల బాధ్యతలను అప్పగించడంతో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేకు స్పష్టమైన జన సమీకరణ లక్ష్యాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించింది. కాగా వారికి ఉమ్మడి జిల్లాల వారీ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల ఇన్-చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 5 వేల మందిని తరలించాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కేవలం నాయకులే కాకుండా, బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఇంటింటికీ వెళ్లి ప్రధాని సభకు ఆహ్వానించేలా ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షలకు పైగా జనంతో భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభ ద్వారా పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రత్యర్థి పార్టీలకు గట్టి సంకేతం పంపాలని కాషాయ పార్టీ భావిస్తోంది. త్వరలో గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సభను సక్సెస్ చేసి ఆ ఎన్నికలకు కలిసొచ్చేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాకుండా బెంగాల్ స్ఫూర్తిని కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నగరం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనాలను తరలించే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.
Also Read: దేవాదాయ శాఖ చరిత్రలోనే ఇదో కీలక అడుగు.. ఇక ఆ సమస్యకు చెక్..!
కేవలం రాజకీయ సభగానే కాకుండా, తెలంగాణ అభివృద్ధికి ప్రధాని పెద్దపీట వేయనున్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ.8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు, వరంగల్లో రూ.1,695 కోట్లతో నిర్మించనున్న పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నేతృత్వంలో ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో కీలక సమావేశాలు నిర్వహించి సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సభ ద్వారా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి సవాల్ విసిరేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి, మోడీ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో తమ బలాన్ని చాటుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుకు ఈ సభ ఒక పరీక్షగా మారనుంది.
Also Read: హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!