BJP leader Warning to Prakash Raj: రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి సినీ నటుడు ప్రకాష్ రాజ్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ రామాయణ ఘట్టాలను, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలపై శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో “ప్రకాష్ రాజ్ను ఎవరైనా చంపితే ఆ కేసులో ఏ-1 (A1) ముద్దాయిగా ఉండటానికి నేను సిద్ధం.. ఆ బాధ్యత నాదే.” అంటూ ఆయన చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
శ్రీనివాస్ రెడ్డి ఆరోపణల ప్రకారం.. ప్రకాష్ రాజ్ నార్త్ నుండి వచ్చిన రాముడు, లక్ష్మణుడు అడవిలో పండ్లు తింటుంటే దానికి జీఎస్టీ (GST) కట్టాలని, అలాగే వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో పవిత్రమైన రామాయణాన్ని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిని కించపరచడం సహించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. నాస్తికుడిని అని చెప్పుకునే ప్రకాష్ రాజ్, కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితం, గత ప్రవృత్తిపై కూడా శ్రీనివాస్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఆయనను అర్బన్ నక్సలైట్ గా, తుకుడే గ్యాంగ్ సభ్యుడిగా అభివర్ణించారు. జేఎన్యూ (JNU) లో దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారికి, బీఫ్ ఫెస్టివల్స్ జరిపేవారికి ప్రకాష్ రాజ్ మద్దతుదారుడని ఆరోపించారు. దక్షిణ భారతీయుడినని చెప్పుకుంటూనే రాముడిపై జోకులు వేయడం ఆయన పైశాచిక ఆనందానికి నిదర్శనమని విమర్శించారు. సనాతన ధర్మం, హిందూ విలువలపై ఇకపై ఎక్కడ జోకులు వేసినా వెంటాడి వేటాడతామని హెచ్చరించారు.
రామోజీ ఫిలిం సిటీలో లేదా మరెక్కడైనా షూటింగ్ జరిగితే అక్కడికి వచ్చి అడ్డుకుంటామని, ప్రకాష్ రాజ్ టూర్ డైరీని ఫాలో అవుతామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రకాష్ రాజ్ను సినిమా ఇండస్ట్రీ నుండి పూర్తిగా బ్యాన్ చేయాలని అగ్ర హీరోలు, నిర్మాతలను ఆయన డిమాండ్ చేశారు. ఇది నయా భారత్ అని, ఇక్కడ హిందూ ధర్మాన్ని కించపరిస్తే భరించబోమని, పాకిస్థాన్లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లను దృష్టిలో పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: సుప్రీంకోర్టులో ఊరట లభించేనా? ఓటుకు నోటు కేసుపై సర్వత్రా ఉత్కంఠ