TamiliSai Soundararajan Comments on MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ లో నిర్వహించిన ఓ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈ రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన సమయంలో కేసీఆర్.. కనీస ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
కనీసం గవర్నర్ పదవికి కూడా ఆయన మర్యాద ఇవ్వలేదన్నారు. ఇలాంటి కేసీఆర్ మాటలు నమ్మొద్ధన్నారు. కవిత ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..? ఆమె చేసిన నిర్వాకం వల్ల జైలుకు వెళ్లిందన్నారు. అంతేకాదు ఆమె చేసిన నిర్వాకం వల్ల తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటూ తమిళి సై పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
అయితే, రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన తమిళి సై.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని సౌత్ చెన్నైయ్ నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఆమె రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రచార సభలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Also Read: యాదాద్రి ఆలయంలో ఆసక్తికర సంఘటన
రాష్ట్ర గవర్నర్ గా ఆమె పని చేసిన సమయంలో పలు సందర్భాల్లో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ప్రాధాన్యతనివ్వడంలేదని, తాను రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి వెళ్తే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులెవరూ కూడా ప్రొటోకాల్ పాటించడంలేదంటూ ఆమె పేర్కొన్న విషయం విధితమే. అటు బీఆర్ఎస్ నేతలు కూడా తమిళి సై బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే.