Telangana Bjp: జెన్ జీ దెబ్బకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోందా? ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఓ వైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్.. జెన్ జీ ప్రతినిధులతో మంతనాలు, ఇంకోవైపు పార్టీ నేతలకు హైకమాండ్ అలర్ట్ చేస్తోందా? 2029 ఎన్నిలకు ఇప్పటినుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందా? ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ నుంచి పిలుపు వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జంతర్ మంతర్లో జెన్ జీ ఉద్యమంతో బీజేపీ హైకమాండ్ ఉలిక్కిపడింది. యువతీ యువకుల తెగువ చూసి ఆలోచనలో పడింది. విద్యార్థుల ఆందోళనపై నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారంటే.. పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదెలా జరుగుతుండగా.. మరోవైపు జెన్జీ, జెన్ ఆల్ఫా ప్రతినిధులతో ఆర్ఎస్ఎస్ భగవత్ భేటీ కావడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ తరం ప్రశ్నలు అడిగి వాటి నుంచి సమాధానాలు రాబడుతోందన్నారు. వాటిని నేతలు నిరాకరిస్తే జనం ఉద్యమం వైపు మళ్లుతారని మనసులోని మాట బయటపెట్టారు.
సీన్కట్ చేస్తే.. జంతర్ మంతర్ ఉద్యమం నుంచి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది బీజేపీ హైకమాండ్. జెన్ జీ ప్రభావం బీహార్ బైపోల్లో స్పష్టంగా కనిపించింది. మూడు దశాబ్దాల కంచుకోటను బీజేపీ కోల్పోవడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పార్టీ నేతలను అలర్ట్ చేసినట్లు సంకేతాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ బీజేపీ నేతలతో అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక భేటీ జరగనుంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హస్తినకు చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి తెలంగాణ చీఫ్ రామచందర్రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న సమావేశంలో ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆయన చర్చించనున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పు- నిప్పుగా ఉన్న నేతల మధ్య సయోధ్య కుదుర్చుడంలో సక్సెస్ అయ్యింది బీజేపీ హైకమాండ్. కలిసికట్టుగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తున్నారు బీజేపీ ఎంపీలు.
ALSO READ: హైదరాబాద్లో భారీ బస్సు టెర్మినల్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటన
అంతేకాదు తరచూ కలిసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, నేతలు విందులకు ఆహ్వానించుకుంటున్నారు ఎంపీలు. తామంతా కలిసి ఉన్నామని సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు ఓ నివేదిక ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, హైకమాండ్ ఆదేశాల అమలు సహా పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది.