Women Reservation: స్వేచ్ఛ బ్యూరో: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండి కూటమి వ్యతిరేకించడం చరిత్రలో బ్లాక్ డే గా నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ లో బిల్లు వీగిపోవడంపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు, మహిళలకు రాజకీయ అధికారం ఇవ్వాలని చాయ్ వాలా అయిన ప్రధాని మోడీ ప్రయత్నిస్తే దాన్ని మద్దతు తెలపకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ధ్వజమెత్తారు. మహిళలకు తీరని అన్యాయాన్ని కాంగ్రెస్ చేసిందని విమర్శించారు. మహిళలంతా కాంగ్రెస్ ను శిక్షించాలన్నారు.
చట్టసభల్లోకి మహిళలను రానివ్వకుండా కాంగ్రెస్ పాపం చేసిందని ఫైరయ్యారు. వారి కుటుంబలో ఉన్న వ్యక్తులే అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని, ఇందిరా, సోనియా, ప్రియాంక మాత్రమే ఉండాలని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు వస్తే తరిమికొట్టాలని, వారికి ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేదని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, అందుకే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, ఇండి కూటమికి పాపం తగలడం ఖాయమని రాంచందర్ రావు మండిపడ్డారు.
Also read: భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై..!
కాంగ్రెస్ పాలనలో.. సామాన్య ప్రజలు, కార్మికులు, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే నిలయం సెక్రటేరియట్ లోనే ఉద్యోగులు భోజన విరామ నిరసన చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు. సచివాలయ ఉద్యోగులకే దిక్కులేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన సచివాలయ ఉద్యోగులకు శాపంగా మారిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి కేవలం పబ్లిసిటీ వ్యామోహంలో ఉన్నారని ఫైరయ్యారు.
ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం, విలీనం కోసం ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో వారిని చూసి ప్రభుత్వం వణికిపోతోందని ఎద్దేవాచేశారు. అందుకే కొన్ని జేఏసీలో లేని సంఘాలతో లాలూచీ పడి, కార్మికుల ఐక్యతను దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాగే కార్మికులను మోసం చేశారని, పీఆర్సీ, ఏరియర్స్ అడిగితే కుట్రలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశౄరు. రాష్ట్రమంతా సమ్మెల బాట పట్టినా, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also read: లోక్సభలో వీగిపోయిన మహిళా బిల్లు.. ప్రజాస్వామ్య విజయం అన్న సీఎం రేవంత్ రెడ్డి!